Raviteja, Gopichand Malineni Movie : రవితేజ కొత్త సినిమాకి బ్రేకులు పడ్డాయా? అందుకు బడ్జెట్ సమస్యలే కారణమా? అంటే ఫిలిం సర్కిల్స్ లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. మామూలుగా అయితే స్టార్ హీరోల సినిమా షూటింగ్స్ ఆలస్యం అవుతుంటాయి. కానీ ఉన్నట్టుండి మధ్యలో బ్రేకులు పడడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా ఈ పరిణామం రవితేజ సినిమాకు జరగడం గమనార్హం. గోపీచంద్ మలినేని - రవితేజ కాంబినేషన్లో #RT4GM పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. అలాగే సినిమాలో నటిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను పోస్టర్స్ ద్వారా వెల్లడించారు.


ఇప్పటికే గోపీచంద్ మలినేని - రవితేజ కాంబినేషన్లో 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ ప్రాజెక్టుకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 23 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సింది. కానీ హఠాత్తుగా ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి సినిమాకి బ్రేకులు పడడానికి బడ్జెట్ సమస్యలే కారణమని తెలుస్తోంది. ఈ మూవీ బడ్జెట్ విషయంలో లెక్కలు కుదరడం లేదని, మార్కెట్ లెక్కలకు సినిమాకి అనుకున్న బడ్జెట్ కి మధ్య చాలా డిఫరెన్స్ ఉండటంతో ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్లు చెబుతున్నారు.


మరోవైపు టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన మైత్రి మూవీ మేకర్స్ దగ్గర డబ్బు సమస్య ఉండదని, స్క్రిప్ట్ లో ఏదో అసంతృప్తిగా అనిపించడంతోపాటు ప్రొడక్షన్ పరంగా అవసరానికి అనుగుణంగా బడ్జెట్ ఎంత పెట్టాలనే దానిపై డిస్కషన్ జరుగుతుందని, అందుకే ఈ ప్రాజెక్ట్ ని పాజ్ లో పెట్టారు తప్పితే మొత్తంగా సినిమా అయితే ఆగిపోలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఏది ఏమైనా రవితేజ - గోపీచంద్ మలినేని సినిమాకి ఇలా ఊహించని పరిణామం ఎదురు కావడంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. 'క్రాక్' మూవీ లాగే నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చుండూరు నేపథ్యంలో కేవలం ఒక్కరోజు జరిగే కథతో ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.


ఇక సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి, రష్మిక మందన, ప్రియాంకా మోహన్ పేర్లను పరిశీలించిన మూవీ టీం ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలేదు. రీసెంట్ గా 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageshwararao) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ ప్రస్తుతం 'ఈగల్'(Eagle) మూవీలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల టీజర్ విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read :'కడక్ సింగ్' ట్రైలర్ - వింత వ్యాధి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ - ఓ ఫ్యామిలీ మ్యాన్ ఎమోషనల్ జర్నీ ఇదీ!