మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజతో కలిసి చిరంజీవి నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవడంతో పాటూ ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా కొనసాగుతోంది.


'వాల్తేరు వీరయ్య' 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూవీ టీం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. సినిమాలపై పడకుండా అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?" అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సాధారణంగా చిరంజీవి సినిమా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఇతర విషయాల గురించి మాట్లాడరు. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించడం చర్చనీయమైంది.






చిరంజీవి ఎప్పుడూ కూడా వినయంగానే మాట్లాడతారు. ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలన్నా కూడా నవ్వుతూనే తనదైన శైలిలో చురకలు అంటిస్తారు. ఇప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం పై అలాగే ఎంతో పద్ధతిగా కౌంటర్లు వేశారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి. కాగా ఇప్పటివరకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ కి మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఆ మధ్య రెండు మూడుసార్లు స్వయంగా జగన్ ఇంటికి కూడా వెళ్లి వచ్చారు చిరంజీవి. గతంలో జగన్ కి ఇండస్ట్రీ తరపున ఎన్నో విన్నపాలు చేసుకున్నారు. చేతులు జోడించి మరి వేడుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


అలాంటిది ఇప్పుడు చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన నటించిన 'భోళాశంకర్' సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? అనే డిస్కషన్స్ సైతం ఇప్పుడు నెట్టింట జరుగుతున్నాయి. చిరంజీవి బహుశా ‘ప్రెస్ మీట్’ మంత్రులను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని అభిమానులు అనుకుంటున్నారు.  'భోళా శంకర్' ఈ నెల 11 న రిలీజ్ కాబోతోంది. ఏపీలో ఈ సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై కౌంటర్లు వేయడం.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో  చూడాలి.


 Also Read : ‘ఖుషి’ రికార్డ్‌ను బ్రేక్ చేసిన మహేష్ - రీ రిలీజ్‌లో 'బిజినెస్ మెన్' ఆల్ టైమ్ రికార్డ్!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial