సూపర్ స్టార్ మహేష్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'బిజినెస్ మెన్' మూవీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ రీ రిలీజ్ పై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. 'బిజినెస్ మెన్' రీ రీలీజ్ టికెట్స్ అయితే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా బిజినెస్ మెన్ రీరిలీజ్ టికెట్స్ హైదరాబాదులో ఏకంగా రూ. 92 లక్షల గ్రాస్ తో ఆల్ టైం అడ్వాన్స్ బుకింగ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ గణాంకాలు ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షో లో నమోదయ్యాయి.


హైదరాబాదులో బిజినెస్ మెన్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రూ.90 లక్షల గ్రాస్ అందుకొని పవన్ కళ్యాణ్ 'ఖుషి' అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ని దాటేసాయి. రీ రిలీజ్ కు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా తో పాటు ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మొత్తం మీద 'బిజినెస్ మెన్' 4k రీ రిలీజ్ కి సంబంధించి ఇప్పటికే అన్ని షోలకు సంబంధించిన టికెట్ సేల్స్ ఓ రేంజ్ లో ఉండడంతో మరోసారి అడ్వాన్స్ బుకింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద తన స్టార్ డం చూపుతున్నారు మహేష్ బాబు.


ఇక బిజినెస్ మాన్ విషయానికొస్తే.. డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2012లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా మహేష్ ఫ్యాన్స్ కి ఫేవరెట్ మూవీ గా మారింది. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ ఇంటెన్స్ పర్ఫామెన్స్ పీక్స్ లో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మరియ ఆయన స్వాగ్, మాస్ పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకుల్ని, మహేష్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పటికీ ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఇప్పుడు రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ము లేపుతోంది.


కాగా ఎస్.ఎస్ తమన్ కంపోజ్ చేసిన ఈ సినిమా పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాగే సినిమాలో మహేష్ బాబు కాజల్ మధ్య కెమిస్ట్రీ, లవ్ స్టోరీ కూడా అదిరిపోతుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాని కేవలం 74 రోజుల్లోనే పూర్తి చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో షార్ట్ టైం పీరియడ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ గా 'బిజినెస్ మెన్' సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్ల గ్రాస్ అందుకుని 2012లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.


కాగా ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.


Also Read : లైలా చేసిన పనికి చనిపోయేవాళ్లం - అందుకే ఆమెను కొట్టా: జేడీ చక్రవర్తి




Join Us on Telegram: https://t.me/abpdesamofficial