Bhola Sankar Trailer: మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు షూటింగ్ పనులు పూర్తి చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ ను కూడా షురూ చేస్తున్నారు మేకర్స్. ఇక చిరంజీవి కూడా చిరు లీక్స్ అంటూ మూవీ నుంచి అప్డేట్ లు ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చేసింది. త్వరలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ మూవీ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. 


జులై 27 న ‘భోళా శంకర్’ ట్రైలర్..


మెగా స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న టైమ్ మరింత దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికే ‘భోళాశంకర్’ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో మూవీ ట్రైలర్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మూవీ ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. జులై 27 న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “మెగా ఎంటర్‌టైనింగ్ యాక్షన్ అద్భుతానికి రెడీగా ఉండండి’’ అంటూ అందులో రాసుకొచ్చారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూవీ తమిళ్ లో అజిత్ నటించిన ‘వేదాళం’ అనే సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. తెలుగు నేటివిటీకు తగ్గట్టు అలాగే చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీను తెరకెక్కిస్తున్నారు మెహర్ రమేష్. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. 


ఈ నెలాఖరు మెగా ఫ్యాన్స్ కు పండగే..


ఇప్పటికే ‘భోళా శంకర్’ మూవీ నుంచి వరుసగా వస్తోన్న అప్డేట్ లు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు నెలాఖరుకు మూవీ ట్రైలర్ లాంచ్ అని ప్రకటించడంతో మెగా అభిమానులకు డబుల్ కిక్ ఇచ్చినట్టు అయింది. జులై 27 న ‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్ అవుతుండగా ఇక జులై 28 న పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా ఒకే సారి మెగా హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు రావడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చినట్టే అయింది. 


ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలు పాత్రలో నటి కీర్తి సురేష్ కనిపించనుంది. అలాగే హీరో సుశాంత్ కూడా ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడు.  తరుణ్ అరోరా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, శ్రీముఖి, సత్య ఈ చిత్రంలో కీలక పాత్రలు చేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై రామ్‍ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ మూవీకు మహతీ స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. మూవీను ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 






Also Read: హాస్పిటల్ బెడ్‌పై కదల్లేని స్థితిలో మౌనీ రాయ్ - ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీకి ఏమైంది?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial