మంచి హిట్ కోసం చూస్తున్న మంచు విష్ణు.. ఈ సారి ఏకంగా పాన్ ఇండియా మూవీతో తన లక్ పరీక్షించుకుంటున్నాడు. త్వరలోనే ‘కన్నప్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో మంచు విష్ణుతోపాటు మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ.. ‘కన్నప్ప’ మూవీ టీమ్ అంతా విచ్చేశారు. 


ఇక టీజర్ విషయానికి వస్తే.. మంచు విష్ణు అదిరిపోయే ఎంట్రీతో టీజర్ ప్రారంభమైంది. కొన్ని యాక్షన్ సీన్స్‌ తర్వాత.. అక్షయ్ పాత్రను పరిచయం చేశారు. కన్నప్ప.. శివయ్యా అని పిలవగానే.. శివుడు (అక్షయ్ కుమార్) కళ్లు తెరవడం.. ఆ తర్వాత తన భక్తుడిని ఆదుకోడానికి నందీశ్వరుడిని దూతగా పంపినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. అయితే, ఆ నందిశ్వరుడి పాత్రలో ఉన్నది ప్రభాస్ అని స్పష్టమవుతోంది. ప్రభాస్ క్యారెక్టర్‌ను పూర్తిగా రివీల్ చేయలేదు. కేవలం కళ్లు మాత్రమే చూపించారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


‘కన్నప్ప’ మూవీ టీజర్ :



టీజర్ ప్రకారం.. విజువల్స్ బాగానే ఉన్నాయి. పాత్రలు మాత్రం ‘నెట్‌ఫ్లిక్స్’ వెబ్ సీరిస్‌లు ఎక్కువగా చూసేవారికి ‘వైకింగ్స్’ గుర్తుకొస్తారు. ఇక మంచు విష్ణు పాత్రలో ఒదిగిపోయారు. అలాగే శివుడి పాత్రలో ఉన్న అక్షయ్ కుమార్‌ను కూడా పూర్తిగా చూపించలేదు. అలాగే ఈ సినిమాలోని మిగతా పాత్రలను కూడా పరిచయం చేయలేదు. త్వరలోనే ఒక్కో పాత్ర రివీల్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఇంకా సీనియర్ నటులు శరత్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఉన్నారు. మధుబాల, కాజల్‌ అగర్వాల్‌ కూడా పలు పాత్రల్లో మెరవనున్నారు.


ఈ మూవీకి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో హిందీలో ‘మహాభారత్’ సీరిస్‌ను రూపొందించారు. ఈ మూవీలో పతాక సన్నివేశాలన్నీ న్యూజిలాండ్‌లోనే చిత్రీకరిస్తున్నారు. మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ఈ మూవీకి అవసరమైన కొన్ని సెట్స్ కూడా ఇక్కడే తయారు చేసి న్యూజిలాండ్‌కు తీసుకెళ్లారట.


ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లేతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మంచు ఫ్యామిలీకి చెందిన అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ‘కన్నప్ప’ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణం ఉండటంతో జనాల్లో కూడా ఈ మూవీపై ఆసక్తి కలుగుతోంది. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇంకా రిలీజ్ డేట్‌ను ప్రకటించాల్సి ఉంది.


Also Read: ‘స్వాగ్’ నుంచి రేజర్ క్యారెక్టర్ రివీల్ - ముసలివాడి గెటప్‌లో షాకిచ్చిన శ్రీవిష్ణు, కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే!