టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇటీవల షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 'కన్నప్ప' సినిమా చిత్రీకరణ సమయంలో విష్ణుకు ప్రమాదం జరిగిందని, యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు అతని చేతికి తీవ్ర గాయాలయ్యాయని, దీంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారని ప్రచారం జరిగింది. విష్ణుకు ఏమైందో అని మంచు అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో విష్ణు ఆరోగ్యంపై స్పందించారు.


మంచు మోహన్ బాబు బుధవారం ట్విట్టర్ వేదికగా విష్ణు హెల్త్ అప్డేట్ అందించారు. దేవుడి దయవల్ల తన కుమారుడు కోలుకుంటున్నాడనే గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు. ''న్యూజిలాండ్‌లో 'కన్నప్ప' సెట్‌లో గాయపడ్డ విష్ణు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, సపోర్ట్ కు ధన్యవాదాలు. భగవంతుని దయతో అతను కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్‌ లో పాల్గొంటాడు. హర హర మహాదేవ్!'' అని మోహన్ బాబు తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.






'కన్నప్ప' అనేది మంచు విష్ణు, మోహన్ బాబుల డ్రీం ప్రాజెక్ట్. ఎన్నాళ్లుగానో ఈ కథ మీద వర్క్ చేసిన విష్ణు.. ఈ మధ్యనే ఈ చిత్రాన్ని పట్టలెక్కించారు. భారీ షెడ్యూల్ కోసం చిత్ర బృందం అంతా కలిసి న్యూజిలాండ్‌ వెళ్ళారు. ఇందులో భాగంగా డ్రోన్ సహాయంతో ఓ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా.. డ్రోన్‌ అదుపు తప్పి విష్ణు మీదకు రావడంతో అతని చేతికి దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం విష్ణు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోహన్‌ బాబు కుమారుడి హెల్త్‌ గురించి అప్డేట్ ఇవ్వడంతో మంచు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.


ఇదిలా ఉంటే 'కన్నప్ప' సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చే ప్రతీ అప్డేట్, అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, లేడీ సూపర్ స్టార్ నయనతార, కన్నడ పవర్ స్టార్ శివ రాజ్ కుమార్ సహా పలువురు అగ్ర తారలు ఈ సినిమాలో నటించబోతున్నారు. ఈ విషయం మీద మేకర్స్ సైడ్ నుంచి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.


మహాభారతం సీరియల్‌ డైరెక్ట్ చేసిన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ 'కన్నప్ప' చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శివ భ‌క్తుడైన క‌న్న‌ప్ప క‌థ‌ ఆధారంగా ఈ పౌరాణిక ఫాంటసీ డ్రామా సినిమా తెరకెక్కుతోంది. బుర్రా సాయిమాధ‌వ్‌, ప‌రుచూరి గోపాల‌కృష్ణ, జి. నాగేశ్వర రెడ్డి, తోట ప్ర‌సాద్ వంటి రచయితలు ఈ స్టోరీపై వర్క్ చేశారు. ఇందులో క‌న్న‌ప్ప‌గా మంచు విష్ణు నటిస్తుండగా.. శివపార్వతుల్లా ప్రభాస్ - నయనతార కనిపించబోతున్నారు. నుపుర్ సనన్ హీరోయిన్ గా ఎంపిక చేయగా, డేట్స్ సర్దుబాటు చేయాలని కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.


24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో 'కన్నప్ప' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు మంచు మోహన్ బాబు. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూరుస్తున్నారు. ఆంటోనీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.


Also Read: సినిమా తీసేంత డబ్బు జబర్దస్త్ కమెడియన్​కి ఎలా వచ్చింది?