Mammootty's Bramayugam Release Date: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఆయన.. అవకాశం వచ్చినప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తున్నారు. 70+ ఏజ్ లోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్న మమ్ముట్టి.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'భ్రమయుగం' అనే హారర్‌ థ్రిల్లర్‌ తో ఆడియన్స్ ను భయపెట్టడానికి రెడీ అయ్యారు.


మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భ్రమయుగం'. 'ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇప్పటికే రిలీజైన స్పెషల్ పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాదు, ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి, అధికారికంగా ప్రకటించారు.


'భ్రమయుగం' చిత్రాన్ని 2024 ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.






Also Read: 'పుష్ప 2' To 'సలార్ 2'.. టాలీవుడ్ బాక్సాఫీస్ ని ఢీకొట్టబోయే క్రేజీ సీక్వెల్స్ ఇవే!


విభిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన 'భ్రమయుగం' చిత్రంలో మమ్ముట్టి పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోందని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో అర్జున్ అశోకన్, సిద్దార్థ్‌, భరతన్, అమల్దా లిజ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం సమకూర్చారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.


'భ్రమయుగం' సినిమాని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ & వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో సాంగ్స్ ను రిలీజ్ చేయడం ద్వారా మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ మలయాళ వెర్షన్ ఓవర్సీస్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ట్రూత్ గ్లోబల్ ఫిల్మ్స్ సంస్థ దక్కించుకోగా, కేరళలో AAN మెగా మీడియా వారు రిలీజ్ చేయనున్నారు.


'యాత్ర 2' విడుదలైన వారానికే... 
ఇదిలా ఉంటే మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన 'యాత్ర 2' సినిమా కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదల కానుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్. దీనికి మహి వి రాఘవ్ దర్శకత్వంలో వహించారు. ఇందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2024 ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఇక వారం రోజుల గ్యాప్ లో 'భ్రమయుగం' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ రెండు చిత్రాలు సీనియర్ హీరోకి ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.


Also Read: శృతి హాసన్ చేతికి సమంత సినిమా!