Bhimaa Pre Release Event: కమర్షియల్ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అవి కొందరు హీరోలకు సక్సెస్ ఫార్ములాగా మిగిలిపోతాయి. అలాంటి వారిలో గోపీచంద్ ఒకరు. మ్యాచో స్టార్ గోపీచంద్.. చివరిగా ‘రామబాణం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందించలేదు. అందుకే ప్రస్తుతం తన ఆశలన్నీ అప్‌కమింగ్ మూవీ ‘భీమా’పైనే ఉన్నాయి. ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేయడానికి మేకర్స్.. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. హన్మకొండలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.


పేరుపేరునా ధన్యవాదాలు..


‘భీమా’ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ నిర్మించారు. ఇందులో గోపీచంద్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికీ పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. సినిమా ఔట్‌పుట్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గోపీచంద్ మాట్లాడారు. ‘‘ఇన్నేళ్ళ నుండి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. భీమా ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి’’ అంటూ ‘భీమా’ సక్సెస్ గురించి నమ్మకంగా మాట్లాడారు గోపీచంద్.


బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు..


‘భీమా’కు దర్శకుడిగా వ్యవహరించిన ఏ హర్ష కన్నడలో పలు చిత్రాలను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాతో మొదటిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు. తను కూడా ఈ సినిమాపై నమ్మకాన్ని బయటపెట్టాడు. ‘‘భీమా పేరు వింటేనే పవర్ మాస్ ఎనర్జీ. గోపిచంద్‌కి కథ నచ్చడంతోనే ఈ సినిమా మొదలైయింది. భీమా ప్రేక్షకులకు నచ్చుతుందనే  నమ్మకంతో మొదలుపెట్టాం. మార్చి8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు హర్ష. ఇందులో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించగా.. ప్రియా మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాలేదు. మాళవిక శర్మ మాత్రమే ‘భీమా’తో తనకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంది.


థియేటర్లలో చూడండి..


‘భీమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాళవిక శర్మ మాట్లాడుతూ ‘‘దర్శకుడు హర్ష నాకు చాలా విషయాలు నేర్పించారు. గోపీచంద్‌తో వర్క్ చేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది’’ అంటూ సినిమాను థియేటర్లలో చూడమని కోరింది ఈ భామ. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా హాజరయిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సైతం మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘భీమా’ అనేది కేవలం యాక్షన్ మూవీ కాదని, ఇందులో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా దాగి ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా పెద్దగా ఇతర చిత్రాలు కూడా ఏమీ లేకపోవడంతో కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.


Also Read: ‘ఆహా’ మిస్సింగ్ - ప్లే స్టోర్‌లో కనిపించని ఓటీటీ యాప్