సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) విదేశాలకు వెళుతున్నారని తెలిస్తే చాలు... ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలు అవుతోంది. ఫ్యామిలీతో ఆయన ఫారిన్ టూర్ వెళ్లిన ప్రతిసారి 'గుంటూరు కారం' సినిమా విషయంలో ఏదో ఒక గడబిడ జరుగుతోంది. అందుకని, సూపర్ స్టార్ ఫారిన్ వెకేషన్ అంటే ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీ శనివారం ఉదయం విదేశాలు వెళ్ళింది. ఆ వెంటనే 'గుంటూరు కారం' మీద ఓ న్యూస్ బయటకు వచ్చింది. 


సినిమాటోగ్రాఫర్ వాకవుట్ చేశారా?
'గుంటూరు కారం' సినిమాకు పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పుడు ఆయన సినిమా నుంచి తప్పుకొన్నారని, తాను చేయలేనని వాకవుట్ చేశారని ఫిల్మ్ నగర్ గుసగుస. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహించిన 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలకు పిఎస్ వినోద్ పని చేశారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. మరి, ఇప్పుడు ఎందుకు వాకవుట్ చేశారో మరి!?


ఇంతకు ముందు ఫారిన్ టూర్లు వెళ్ళినప్పుడు...
మహేష్ బాబు ఇంతకు ముందు ఫారిన్ టూర్లు వేసినప్పుడు కూడా సినిమా టీమ్ విషయంలో మేజర్ ఛేంజెస్ జరిగాయి. గతంలో ఒకసారి ఫైట్ మాస్టర్లను ఛేంజ్ చేశారు. 'కెజియఫ్'లో స్టంట్స్ చేసిన ఫైట్ మాస్టర్లను తీసుకొచ్చి ఒక ఫైట్ చేశారు. ఆ తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి వేరే ఫైట్ మాస్టర్లను తీసుకు వచ్చారు. ఓసారి స్క్రిప్ట్ మార్చారు. హీరోయిన్ పూజా హెగ్డే సైతం సినిమా నుంచి తప్పుకొన్నారు.


'గుంటూరు కారం' సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ అడుగు ముందుకు పడితే... రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది వ్యవహారం. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన్ను తప్పిస్తున్నట్లు బోలెడు పుకార్లు. ఆ విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆగడం లేదు. అందుకని, అభిమానుల్లో బోలెడు సందేహాలు నెలకొంటున్నాయి.


Also Read : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా - ట్రైలర్ వచ్చేసింది 'బ్రో'



సంక్రాంతికి 'గుంటూరు కారం' విడుదల
'గుంటూరు కారం'ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. 


Also Read 'ఓపెన్ హైమర్' రివ్యూ : ఇది నోలన్ సినిమా, అణుబాంబు సృష్టికర్త బయోపిక్!


ఆల్రెడీ 'గుంటూరు కారం' టీజర్ విడుదలైంది. మాస్ స్ట్రైక్ పేరుతో ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. అందులో కర్రసాముతో రౌడీలను చితక్కొడుతూ మహేష్ బాబు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా, తలకి ఎర్ర కండువా... ఆయన సరికొత్త మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నోటిలో నుంచి బీడీ తీసి, స్టైలుగా వెలిగించి 'ఏంది అట్టా చూస్తున్నావు... బీడీ త్రీడీలో కనపడుతుందా" అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి ఎప్పటిలా ఫిదా చేశారు మహేష్. ఆ గ్లింప్స్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial