Mahesh Babu Buys Sudarshan 70 MM: సినీ సెలబ్రిటీలు చాలావరకు కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టకుండా అందులో నుండి వచ్చే లాభాలతో ఇతర వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పటికే టాలీవుడ్‌లోని చాలామంది స్టార్ హీరోలకు రెస్టారెంట్స్, థియేటర్లు, క్లోత్ బ్రాండ్స్.. ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి హీరోలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఒకరు. మహేశ్‌కు ఉన్న బిజినెస్‌లలో మల్టీప్లెక్స్ కూడా ఒకటి. ‘ఏఎమ్‌బీ సినిమాస్’ అనే పేరుతో ఇప్పటికే గచ్చిబౌలిలో తనకంటూ సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు మహేశ్. ఇప్పుడు అదే బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు.


7 స్క్రీన్ మల్టీప్లెక్స్..


2018లో శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఏఎమ్‌బీ సినిమాస్ ప్రారంభమయ్యింది. 7 స్క్రీన్ మల్టీప్లెక్స్‌గా ప్రారంభమయిన ఈ థియేటర్ సూపర్ సక్సెస్‌ను సాధించింది. మిగతా థియేటర్లకంటే ఇందులో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా.. స్క్రీన్ క్వాలిటీ కూడా అదే రేంజ్‌లో ఉండడంతో ప్రేక్షకులు ఇందులో సినిమాలు చూడడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మల్టీప్లెక్స్‌లో తన మొదటి అడుగు సక్సెస్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏఎమ్‌బీ సినిమాస్‌ను ప్రారంభించాలని మహేశ్ బాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా హైదరాబాద్‌లో కూడా మరొక బ్రాంచ్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు మొదలయినట్టు సమాచారం.


నిరాశలో మాస్ ఆడియన్స్..


ఏషియన్ సినిమాస్‌తో చేతులు కలిపి మహేశ్ బాబు ప్రారంభించిన ఏఎమ్‌బీ సినిమాస్ థియేటర్ల రూపురేఖలనే మార్చేసింది. అందుకే హైదరాబాద్‌లో ఒకటి, వైజాగ్‌లో మరొకటి స్క్రీన్స్‌ను ఏర్పాటు చేయాలని మహేశ్ నిర్ణయించుకున్నారట. ఇప్పటికే హైదరాబాద్‌లోనే క్లాసిక్ థియేటర్‌గా పేరు తెచ్చుకున్న సుదర్శన్ 70 ఎమ్ఎమ్ థియేటర్‌ను ఏఎమ్‌బీ సినిమాస్‌గా మార్చడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స‌లో ఉన్న ఈ థియేటర్ ఎన్నో ఏళ్లుగా మాస్ ఆడియన్స్‌కు చాలా దగ్గరయ్యింది. దీన్ని ఇప్పుడు క్లాస్ ఆడియెన్స్‌కు కూడా అందుబాటులోకి తెచ్చేలా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని కూడా ప్రకటించనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి..


వైజాగ్‌లో ఇప్పటికే ఏఎమ్‌బీ సినిమాస్ కన్‌స్ట్రక్షన్‌కు పనులు ప్రారంభమయ్యాయని సమాచారం. అంతే కాకుండా త్వరలోనే ఈ కొత్త బ్రాంచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో అప్డేట్ రానుందని తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన ఏఎమ్‌బీ సినిమాస్ సామ్రాజ్యాన్ని ప్రారంభించడానికి మహేశ్ బాబు సిద్ధమయ్యారు. ఇక సూపర్ స్టార్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకున్నా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదలయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుండి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంటోంది. ప్రస్తుతం రాజమౌళితో కలిసి చేయనున్న సినిమాపై ఫోకస్ పెట్టారు మహేశ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే మూవీ సెట్స్‌పైకి కూడా వెళ్లనున్నట్టు సమాచారం.


Also Read: కాబోయే భర్త 'VD' లాగా ఉండాలన్న రష్మిక - పరోక్షంగా హింట్ ఇచ్చిందంటున్న ఫ్యాన్స్!