Ashok Galla: బంజారా హిల్స్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ మీద అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు రైడ్ చేయడం, ఆ సమయంలో అక్కడ ఉన్న 150 మందిని స్టేషన్‌కు తరలించడం, పబ్‌లో డ్రగ్స్ లభించడం తదితర అంశాలు తెలిసినవే. ఈ వ్యవహారంలో కొంత మంది సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, 'హీరో' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయమైన అశోక్ పేరు కూడా ఉంది.


"హైదరాబాద్‌లోని ఓ పబ్ మీద పోలీసులు జరిపిన రైడ్‌లో అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో అతడికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఇటువంటి నిరాధారమైన వార్తలు ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అదే రోజు గల్లా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రోజు (ఏప్రిల్ 5న) తన పుట్టినరోజు సందర్భంగా అశోక్ గల్లా ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు పబ్ వ్యవహారం గురించి ప్రస్తావన వచ్చింది. అశోక్ గల్లా వివరణ ఇచ్చారు.


"నాకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉంది. అందుకని, కొన్ని రోజులుగా ఫిజియో థెర‌పీ చేయించుకుంటున్నాను. ఆ రోజు కూడా ఫిజియో చేయించుకుని త్వరగా నిద్రపోయా. ఉదయం నిద్రలేచి బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటే... సడన్‌గా నా పేరు సోషల్ మీడియాలో, వార్తల్లో చూశా. అసలు, నా పేరు ఎలా వ‌చ్చిందో తెలీదు. నాకు, ఆ ఇష్యూకు సంబంధం లేదు. (సరదాగా నవ్వుతూ...) మీడియాలో పేరు చూసి హీరో అనే ఫీలింగ్ కలిగింది. సెల‌బ్రిటీ లైఫ్‌లో ఇటువంటివి వ‌స్తుంటాయ‌ని అపించింది" అని అశోక్ గల్లా తెలిపారు.


Also Read: 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పెషల్ పార్టీ


'హీరో' సినిమాతో అశోక్ గల్లాకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ హీరో కథలు వింటున్నారు. అతి త్వరలో రెండో సినిమా గురించి ప్రకటన రావచ్చు. తొలి సినిమాకు వచ్చిన స్పందన తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. అందరూ హ్యాపీ అన్నారు. ఇప్పుడు రెండో సినిమా మీద దృష్టి పెట్టినట్టు అశోక్ గల్లా తెలిపారు. కొత్త దర్శకులతో కూడా చేయడానికి తాను సిద్ధమని అన్నారు.  


Also Read: ‘ఆడ’ వీడియో ఏడ? అఖిల్ కోసం ‘బిగ్ బాస్’ బిందు బలి? అందుకే నాగ్ స్పందించలేదా?