Mahesh Babu For PhonePe: సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్‌తో డైలాగులు వింటుంటే ఫ్యాన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. అదే వాయిస్‌లో ఆయన స్టేజ్‌పై ఎప్పుడెప్పుడు స్పీచ్‌లు ఇస్తారా అని ఎదురుచూస్తారు. ఒకవేళ ఆ వాయిస్‌ను వినే అవకాశం రోజూ వస్తే ఎలా ఉంటుంది? రోజులో ఎన్నోసార్లు మహేశ్ బాబు వాయిస్‌తో థాంక్యూ అనే పదం వినిపిస్తే ఎలా ఉంటుంది? ఆలోచనే చాలా కొత్తగా, ఎగ్జైటింగ్‌గా ఉంది కదా.. ‘ఫోన్‌ పే’కు కూడా అదే ఆలోచన వచ్చింది. అందుకే ఒక సరికొత్త ఐడియాతో యూజర్ల ముందుకు వచ్చింది. ఇప్పటినుండి ‘ఫోన్ పే’ స్మార్ట్ స్పీకర్‌లో మహేశ్ బాబు వాయిస్‌ను వినిపించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే పలు చోట్ల ఆయన వాయిస్ వినిపిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు చేసి మరీ మురిసిపోతున్నారు ఫ్యాన్స్.


థ్యాంక్యూ బాస్..


మామూలుగా ఏ బిజినెస్‌కు అయినా ‘ఫోన్ పే’తో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అందుకే వ్యాపారాలు చేసుకునే వారికి ఎంత డబ్బు ట్రాన్సాక్షన్ అయ్యిందో తెలిసేలా, వారు మోసపోకుండా ఉండడం కోసం స్మార్ట్ స్పీకర్స్‌తో ‘ఫోన్ పే’ ముందుకొచ్చింది. మామూలుగా ఈ స్మార్ట్ స్పీకర్ నుండి కంప్యూటర్ నుండి జనరేట్ చేసిన వాయిస్ ఇంతకాలం వినిపిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ స్థానంలో మహేశ్ బాబు వాయిస్ వినిపించనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ‘ఫోన్ పే’లో పేమెంట్స్ చేసినప్పుడు మహేశ్ బాబు వాయిస్‌తో ‘థ్యాంక్యూ బాస్’ అని వినిపిస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ అప్డేట్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.


మొదటిసారి కాదు..


‘ఫోన్ పే’ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తే సెలబ్రిటీల వాయిస్ వినిపించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ హీరో అయిన అమితాబ్ బచ్చన్ కూడా ‘ఫోన్ పే’ స్మార్ట్ స్పీకర్ కోసం తన వాయిస్‌ను ఇచ్చారు. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి మహేశ్ బాబు యాడ్ అయ్యాడు. గతేడాది ఈ యాప్‌లో కస్టమర్ పేమెంట్స్ జరిగినప్పుడు అమితాబ్ బచ్చన్ వాయిస్ వినిపించినప్పుడు ఆయన ఫ్యాన్స్ కూడా ఇలాగే ఆశ్చర్యపోయి పోస్టులు పెట్టారు. ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఫోన్ పే’ స్మార్ట్ స్పీకర్ నుండి మహేశ్ బాబు వాయిస్ వినిపిస్తుందని చెప్పడం కోసం ఒక యాడ్‌ను కూడా తయారు చేయిస్తున్నారు. ఆ యాప్ ద్వారా అధికారికంగా ప్రకటన బయటికి రానుంది.






ఇతర హీరోలతో కూడా..


‘ఫోన్ పే’లో ట్రాన్సాక్షన్ పూర్తయ్యిందని మహేశ్ బాబు వాయిస్‌లో వినిపించగా.. ఆ తర్వాత వచ్చే అమౌంట్ మాత్రం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా క్రియేట్ చేయబడనుంది. ఆ తర్వాత మళ్లీ మహేశ్ వాయిస్‌లోనే ‘థ్యాంక్యూ బాస్’ అని వినిపించనుంది. ఇక ‘ఫోన్ పే’ నుండి వచ్చిన ఈ క్రియేటివ్ ఐడియా చాలామందిని ఇంప్రెస్ చేస్తోంది. హిందీలో అమితాబ్ బచ్చన్ వాయిస్, తెలుగులో మహేశ్ బాబు వాయిస్‌లాగానే ఇతర భాషల సూపర్ స్టార్లతో కూడా ‘ఫోన్ పే’ అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. మలయాళ భాష కోసం మమ్ముట్టిని, కన్నడ భాష కోసం సుదీప్‌తో చర్చలు జరిపిందట ‘ఫోన్ పే’. ఈ వార్త ఆయా హీరోల ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.


Also Read: సినీ పరిశ్రమలో విషాదం - సీనియర్ నటుడు రితురాజ్ కన్నుమూత