బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన 'జవాన్' మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ హైప్ తోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. 'పఠాన్' వంటి భారీ సక్సెస్ తరువాత షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ట్రైలర్ కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో 'జవాన్' రూపంలో షారుక్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అనే మాట వినిపిస్తోంది.


నార్త్ తోపాటు తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనూ 'జవాన్'కి అంచనాలకు మించిన రెస్పాన్స్ దక్కుతోంది. కోలీవుడ్లో వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ మీదున్న అట్లీ 'జవాన్'తో అదే కంటిన్యూ చేయబోతున్నాడని అటు తమిళ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో 'జవాన్' మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'జవాన్' టీంకి బెస్ట్ విషెస్ తెలియజేసిన మహేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.. "ఇది జవాన్ టైం. షారుక్ పవర్ పూర్తిస్థాయిలో సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నాం. అన్ని ఏరియాలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని, జవాన్ యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుటుంబ సమేతంగా ఈ చిత్రం చూడబోతున్నాను" అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు మహేష్ బాబు.






ఇక మహేష్ పెట్టిన ఈ ట్వీట్ కి వెంటనే రెస్పాండ్ అయ్యారు షారుఖ్ ఖాన్. ఈ మేరకు మహేష్ ట్వీట్ ని తన ట్విట్టర్లో రీ పోస్ట్ చేస్తూ.. "థాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్. మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు సినిమా చూస్తున్నప్పుడు నాకు కూడా చెప్పండి, నేను వచ్చి మీతో చూస్తాను. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమను తెలియజేస్తున్నాను" అంటూ షారుక్ రిప్లై ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్, షారుక్ ల ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు 'జవాన్' మూవీపై మహేష్ బాబు ట్విట్ ఆ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఇంకాస్త ప్రమోట్ చేసినట్లు అయింది. దీంతో మహేష్ చేసిన ఈ ట్వీట్స్ పై షారుఖ్ ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సమకాలిన సినిమాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు మహేష్. నిజానికి 'జవాన్' మూవీ పై మహేష్ ట్వీట్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు 'గుంటూరు కారం' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులోనే జరుగుతోంది.


ఇక జవాన్ విషయానికొస్తే.. ఇందులో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు, సానియా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే దర్శకుడు అట్లీతోపాటు హీరోయిన్ నయనతార బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.


Also Read : ప్రభాస్‌తో మళ్ళీ సినిమా ఎప్పుడు? - అనుష్క ఏం చెప్పిందో తెలుసా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial