MAA President Manchu Vishnu Meets Telangana Deputy CM : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ఆదివారం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. మంచు విష్ణు తో పాటు శివ బాలాజీ, సీనియర్ నటుడు రఘు బాబు ఇందులో భాగం అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేశారు. వారికి అభినందనలు తెలిపారు. కొత్త ఏర్పడిన ప్రభుత్వానికి తమ అభినందనలు తెలిపారు. డ్రగ్స్ ని నిర్మూలించే కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సైతం భాగం అవుతుందని తెలిపారు. మంచు విష్ణు సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాలను షేర్‌ చేసుకున్నారు.


ఈ మేరకు మంచు విష్ణు ట్వీట్ చేస్తూ.." తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నో విషయాల మీద చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, డ్రగ్స్ ఫ్రీ సొసైటి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి ప్రభుత్వంతో మేమంతా ఐకమత్యంగా కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నాం" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. 






మంచు విష్ణు ప్రస్తుతం 'కన్నప్ప' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఇటీవలే న్యూజిలాండ్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో శివుడిగా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రభాస్ సైతం 'కన్నప్ప' సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు. రీసెంట్ గానే ప్రభాస్ ఈ సినిమా కోసం డేట్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మొదలు కాబోయే లేటెస్ట్ షెడ్యూల్లో ప్రభాస్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో పాటూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.


అలాగే, మోహన్ బాబు, శరత్ కుమార్ సైతం కీలక పాత్రలు పోషించనున్నారు. హిందీ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరో హీరోయిన్లలో కొందరు కూడా 'కన్నప్ప'లో కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మహాభారత సిరీస్ తీసిన బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ 'ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. ఇదే ఏడాది దసరా కానుకగా సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.


Also Read : 'ఈగల్' మూవీ చూసిన రవితేజ - మాస్ మహారాజ్ ఫస్ట్ రివ్యూ ఇదిగో