అహ్మదాబాద్ నుంచి లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి వెళ్లిన కొద్ది క్షణాలకు క్రాష్ అయింది. ఆ ఘటనలో విమానంలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిగా బయట పడగా... మిగతా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా విమానం పడిన మెడికల్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు పాతిక మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత లక్ష్మీ మంచు గురించి పలువురు ఆరా తీశారు. ఎందుకంటే...
లండన్ వెళ్లిన లక్ష్మీ మంచు...
ఫ్యామిలీతో పాటు ఆవిడ సేఫ్!
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన జరిగిన రోజు భర్త, కుమార్తెతో కలిసి లక్ష్మీ మంచు లండన్ వెళ్లారు. ఆవిడ కూడా ఎయిర్ ఇండియా విమానంలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే అహ్మదాబాద్ నుంచి వెళ్లిన విమానంలో కాకుండా ముంబై నుంచి లండన్ వెళ్లిన విమానంలో లక్ష్మీ మంచు ట్రావెల్ చేశారు. అయితే ఆ విషయం తెలియక చాలా మంది ఆవిడకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో సోషల్ మీడియాలో లక్ష్మి మంచు వివరణ ఇచ్చారు. ఒక వీడియో షేర్ చేశారు.
ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన వీడియోలో లక్ష్మీ మంచు మాట్లాడుతూ... ''అందరికీ హలో. చాలా మందికి వ్యక్తిగతంగా మెసేజ్ చేశాను. సోషల్ మీడియా (ఇన్స్టాగ్రామ్)లో స్టోరీ కూడా పెట్టాను. అయినా సరే చాలా మంది ఫోనులు చేస్తున్నారు. నాన్ స్టాప్గా కాల్స్ వస్తున్నాయి. ఐ యామ్ సేఫ్ (నేను క్షేమంగా ఉన్నాను). నేను ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశాను. అయితే ముంబై నుంచి లండన్ వచ్చాను. నాతో పాటు మా ఆయన అమ్మాయి కూడా ట్రావెల్ చేశారు. దేవుడి దయవల్ల మా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. లండన్ నగరంలో దిగిన తర్వాత నాకు విషయం తెలిసింది'' అని చెప్పారు. ఇంత మంది తన మీద ప్రేమ చూపించడం ఎంతో సంతోషంగా అనిపించిందని అన్నారు.
ఆ కుటుంబాలు బాధ మాటల్లో చెప్పలేం!
విమాన ప్రమాద ఘటనలో మరణించిన వ్యక్తుల కుటుంబాల గురించి ఆలోచిస్తుంటే తన గుండె తరుక్కుపోతుందని లక్ష్మీ మంచు పేర్కొన్నారు. వాళ్ల బాధను మాటల్లో వర్ణించలేమని ఆవిడ తెలిపారు. ఇంకా లక్ష్మీ మంచు మాట్లాడుతూ... ''ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఒక్కసారి మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకోవడం చాలా అవసరం. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఇదే మన చివరి క్షణమైతే ఏం చేస్తాం? అనేది ఆలోచించాలి. జీవితం మనకు ఇచ్చిన దానిపట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి'' అని తెలిపారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోని 'ది ట్రైటర్స్' షోలో ఆవిడ పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే.