తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. సూపర్ స్టార్ కృష్ణతో తెలుగు తెరపై ఘట్టమనేని హీరోల ప్రయాణం ప్రారంభం అయ్యింది. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చిన ఆయన తనదైన నటన, సాహసోపేతమైన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కృష్ణ తర్వాత ఆయన నట వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు వచ్చారు.‌ ఇప్పుడు మరొక వారసుడు వెండితెరపై అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. 


హీరోగా ఎంట్రీకి రమేష్ బాబు తనయుడు రెడీ!
కృష్ణ కుటుంబం నుంచి రెండో తరం బాల నటులుగా ఇండస్ట్రీలో తమ ప్రయాణం ప్రారంభించింది. బాల నటుడిగా మహేష్ బాబు పలు సినిమాలు చేశారు. అయితే చదువు కోసం ఆయన గ్యాప్ తీసుకున్నారు. మహేష్ బాల నటుడుగా చేసిన సమయంలోనే రమేష్ బాబు కథానాయకుడిగా సినిమాలు చేశారు. కానీ, ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో లేరు. కొన్ని సినిమాల తర్వాత నటనకు ఆయన విరామం తీసుకున్నారు. ఇప్పుడు రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా వచ్చేందుకు రెడీ అవుతున్నారు.


ఇటీవల ఘట్టమనేని ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి జరిగింది. అందులో రమేష్ బాబు తనయుడు జయకృష్ణను చూసిన పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకులు ఈ అబ్బాయి హీరో మెటీరియల్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. తాతయ్య, తండ్రి, బాబాయ్ బాటలో నడుస్తూ కథానాయకుడు కావాలని జయకృష్ణ సైతం ప్రయత్నాలు ప్రారంభించారు.


Also Read: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేణు స్వామి... మహిళా కమిషన్‌లో ఫిర్యాదు వల్లనే జర్నలిస్టులపై ఆరోపణలా?



తొలి సినిమాకు జయకృష్ణ ఇంకా సంతకం చేయలేదు. ఆ మాటకు వస్తే ఇంకా ఏ సినిమా ఓకే చేయలేదు. ప్రస్తుతం కథలు వింటున్నారు. ఈ అబ్బాయిని కథానాయకుడిగా పరిచయం చేసేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థలు, దర్శక రచయితలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే... తొలి సినిమా చేయడానికి ముందు నటనలో శిక్షణ తీసుకున్నారు జయకృష్ణ. అమెరికా వెళ్లి యాక్టింగ్ కోర్సు చేశారు. ఇటీవల ఒక ఫోటోషూట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కథ ఓకే అయిన తర్వాత జయకృష్ణ డెబ్యూ మూవీ వివరాలు బయటకు రానున్నాయి. 


అన్నయ్య కొడుక్కి అండగా మహేష్ బాబు!
అన్నయ్య రమేష్ బాబు అంటే మహేష్ బాబుకు ఎంతో ప్రేమ, గౌరవం, అభిమానం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు చాలా మందికి ఆ విషయం తెలుసు. ఇప్పుడు అన్నయ్య కుమారుడిని కథానాయకుడిగా పరిచయం చేసేందుకు మహేష్ తన వంతు సపోర్ట్ చేస్తున్నారని సమాచారం. కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం ఆల్రెడీ తెరంగేట్రం చేసింది. 'వన్ నేనొక్కడినే' సినిమాలో మహేష్ కుమారుడు గౌతమ్ బాల నటుడిగా చేశారు. 'సర్కారు వారి పాట' పాటలో సితార కనిపించింది. కృష్ణ అల్లుడు సుధీర్ బాబు తనయులు సైతం త్వరలో కథానాయకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. 


Also Readఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?