Kota Bommali PS arrives in the OTT : టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ పాత్రల్లో నటించిన 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి ఈ సినిమాని నిర్మించారు. నవంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టింది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సస్పెన్స్ ఎలివెంట్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ కానిస్టేబుల్స్ పాత్రల్లో మంచి నటనను కనబరిచారు.


ముఖ్యంగా శ్రీకాంత్ పాత్రకి  చాలా మంచి పేరు వచ్చింది. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సైతం మరో ప్రత్యేక పాత్రలో మెప్పించింది. ఈ సినిమాలో హోమ్ మంత్రి పాత్రలో మురళీ శర్మ నటించారు. ఆయన పాత్రకు కూడా మంచి స్పందన లభించింది. బెనర్జీ, దయానంద్, సివిఎల్ నరసింహారావు, ప్రవీణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యువ దర్శకుడు తేజా మార్ని ఈ సినిమాని తెరకెక్కించారు. ఆయన దర్శకుడిగా పరిచయమైన 'జోహార్' డైరెక్ట్ ఆహా ఓటీటీలో విడుదల అయ్యింది. ఆ సినిమా విమర్శకులతో పాటు వీక్షకుల ప్రశంసలు అందుకుంది. తొలి సినిమా తర్వాత శ్రీ విష్ణు కథానాయకుడిగా 'అర్జున ఫాల్గుణ' తీశారు. అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.






ఇక ఇప్పుడు మూడో సినిమాగా మలయాళ హిట్ 'నాయట్టు'ను 'కోట బొమ్మాళి పీఎస్'గా రీమేక్ చేశారు. పేరుకి రీమేక్ సినిమా అయినప్పటికీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యాస, భాషలను కథకు అద్దడంలోనూ, మన నేటివిటీకి తగ్గట్లు సినిమా తీయడంలోనూ దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక థియేటర్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.


'కోటబొమ్మాళి పీఎస్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటీటీ వేదిక ఆహా ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ఈ సినిమాను సంక్రాంతికి డిజిటల్ తెరపైకి తీసుకు వస్తున్నట్లు ఆహా సంస్థ ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. చెప్పినట్లుగానే సంక్రాంతి కంటే కాస్త ముందుగానే ఆహా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. జనవరి 11 గురువారం నుంచి ఆహా ఓటీటీలో 'కోటబొమ్మలి పిఎస్' స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని మిస్సై ఉంటే ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది చూసేయండి. మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


Also Read : పుకార్లకు చెక్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ - 'పుష్ప2' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది!