Keerthy Suresh & Suhas: దక్షిణాది అగ్ర కథానాయికల్లో అందాల భామ కీర్తి సురేష్ ఒకరు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి.. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఓవైపు అగ్ర హీరోలతో కలిసి కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతోంది. 'మహానటి' మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించి, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న కీర్తి.. ఇప్పుడు టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో సుహాస్ సరసన నటించడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.


షార్ట్ ఫిలింస్ తో గుర్తింపు తెచ్చుకుని, సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన నటుడు సుహాస్. 'కలర్ ఫోటో' చిత్రంతో హీరో అవతారమెత్తి, తొలి చిత్రంతోనే హిట్టు కొట్టాడు.. విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా జాతీయ అవార్డు సాధించిన తర్వాత కథానాయకుడిగా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు. గతేడాది 'రైటర్ పద్మభూషణ్', ఈ ఏడాదిలో 'అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు' చిత్రాలతో మాంచి సక్సెస్ సాధించాడు. బిజీ షెడ్యూల్స్ తో సంవత్సరం పొడవునా బిజీగా గడుపుతున్న సుహాస్.. ఇప్పుడు కీర్తి సురేశ్ తో జత కట్టబోతున్నారు.


కీర్తి సురేష్ - సుహాస్ ప్రధాన పాత్రల్లో 'ఉప్పు కప్పురంబు' అనే సినిమా రూపొందుతోంది. అని ఐవి శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు నిర్మిస్తున్నారు. దీనికి వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. అయితే ఇది థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమా కాదు. అమెజాన్ ప్రైమ్ ఓటిటి కోసం రూపొందిస్తున్న ఒరిజినల్ మూవీ. ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్ లో ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ప్రకటించి, టైటిల్ లాంచ్ చేసారు. ఈ కార్యక్రమానికి కీర్తి రాలేదు కానీ, వేదిక మీద సుహాస్ సందడి చేశారు.


'ఉప్పు కప్పురంబు' అనేది సెటైరికల్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతోన్న సినిమా. ఒక గ్రామంలోని స్మశానవాటికలో ఖాళీ స్థలం లేకపోవడంతో అక్కడి ప్రజలు అసాధారణ సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఎలాంటి పరిష్కార మార్గాలను కనుగొన్నారనేది ఈ మూవీ స్టోరీ లైన్ గా ప్రచారం చేయబడుతోంది. ఇందులో కీర్తి సురేష్ ది పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్ర కావడంతో, సుహాస్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది.


ఏదేమైనా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్, విక్రమ్, నాని, రామ్, నితిన్, శివ కార్తికేయన్ లాంటి హీరోలతో ఆడిపాడిన కీర్తి సురేష్.. ఇప్పుడు సుహాస్ తో 'ఉప్పు కప్పురంబు' సినిమా చేయడం విశేషమనే చెప్పాలి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే, ఇది కచ్చితంగా సుహాస్ ఇమేజ్ ని పెంచుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారా? లేదా ఇద్దరూ కీలక పాత్రల్లో కనిపించబోతున్నరా? అనేది తెలియాల్సి ఉంది.


ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం 'రివాల్వర్‌ రీటా', 'రఘుతాత', 'కన్నివేడి' వంటి చిత్రాల్లో నటిస్తోంది. 'తేరి' రీమేక్ గా రూపొందుతున్న 'బేబీ జాన్' మూవీతో బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. మరోవైపు సూహాస్ 'ప్రసన్న వదనం', 'గొర్రె పురాణం', 'శ్రీరంగనీతులు', 'ఆనందరావు అడ్వెంచర్స్' సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అలానే దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు.


Also Read: 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి 'గేమ్ ఛేంజర్' వరకు.. క్రేజీ చిత్రాలన్నీ ఆ ఓటీటీలోనే!