సర్కారు వారి పాట షూటింగ్ జరిగే సమయంలో దర్శకుడు పరశురామ్ తన పేరు మర్చిపోయి రష్మిక అని పిలిచేవారని సర్కారు వారి పాట హీరోయిన్ కీర్తి సురేష్ అన్నారు. ఆయన గత సినిమా గీత గోవిందంలో హీరోయిన రష్మిక కాబట్టి అలా అన్నారని, తర్వాతి సినిమాలో రష్మిక హీరోయిన్‌గా చేస్తే కీర్తి సురేష్ అని పిలుస్తారో లేదో చూడాలని క్యూట్‌గా కామెడీ చేశారు. సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్ మాట్లాడారు.


ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘నేను మైత్రి మూవీ మేకర్స్‌తో ఇంతకు ముందే పనిచేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. కానీ సర్కారు వారి పాటతో ఈ ప్రయాణం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాతలందరికీ ధన్యవాదాలు. కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు పరశురామ్‌కు థ్యాంక్స్.’


‘షూటింగ్‌లో పరశురామ్ అప్పుడప్పుడు నా పేరు మర్చిపోయే రష్మిక అనేవారు. ఆయన రష్మికతో తర్వాతి సినిమా చేసేటప్పుడు కీర్తి అని పిలుస్తారో లేదో చూడాలి. ఆయనతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కళావతిగా అందరి మదిలో నిలిచిపోయేలా నన్ను చూపించినందుకు సినిమాటోగ్రాఫర్ మదికి థ్యాంక్స్. ఇది థమన్‌తో నాకు రెండో సినిమా. భం అఖండ లాంటి మాస్ సాంగ్ నుంచి కళావతి వంటి క్లాస్ సాంగ్ వరకు అన్నీ హిట్లు కొడుతున్నారు. పాటలు ఇస్తూ, స్టేజ్ షోలు, లైవ్ షోలు చేయడం చాలా కష్టం. ఇవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు.’


‘మహేష్ బాబుతో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆయన టైమింగ్ ఎలా మ్యాచ్ చేయాలని నాకు టెన్షన్. డబ్బింగ్ చెప్పేటప్పుడు తన గ్లామర్ ఎలా మ్యాచ్ చేస్తానా అని టెన్షన్. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ నన్ను మాట్లాడనిస్తారో లేదో టెన్షన్. కానీ అవి నాకు మాత్రమే టెన్షన్. మీకు (అభిమానులకు) ఇవన్నీ సెలబ్రేషన్స్. మహేష్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్.’


‘ఈ సినిమా కోసం అభిమానులు ఎంత వెయిట్ చేస్తున్నారో తెలుసు. ఆయన ఉన్నారు... ఆయన విన్నారు... ఆయన మీ ముందుకు వస్తున్నారు. మే 12వ తేదీన థియేటర్‌కు వెళ్లి సేఫ్‌గా సినిమా చూడండి. మహేష్ రియల్ లైఫ్ కళావతి నమ్రతకు థ్యాంక్స్. ఆవిడ ఎంతో సపోర్ట్ చేశారు. లవ్ యూ ఆల్...’ అన్నారు.