బాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ రన్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఈ కాంట్రవర్సీలు వారి సినిమాల గురించి అయితే.. కొన్నిసార్లు మాత్రం ఏకంగా నటీనటుల మీదే ఊహించని కాంట్రవర్సీలు ప్రారంభమవుతాయి. బీటౌన్‌లో ఇలాంటి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు దక్కించుకుంది క్వీన్ కంగనా రనౌత్. తనకు నచ్చని విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తూ.. అవతల వ్యక్తి ఎంత పెద్ద హీరో అయినా, దర్శకుడు అయినా, నిర్మాత అయినా భయపడకుండా ఎదురు నిలబడుతుంది. తాజాగా బాలీవుడ్‌లో గ్రాండ్‌గా జరిగిన ఒక హీరో, హీరోయిన్ పెళ్లి గురించి కంగనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వారి పేర్లు నేరుగా చెప్పకపోయినా.. కంగనా చేసిన కామెంట్స్.. రణబీర్ కపూర్, ఆలియా భట్ గురించే అని అందరూ అనుకుంటున్నారు.


రణబీర్ తనను ప్రాధేయపడ్డాడంటూ..


రణబీర్, ఆలియా ప్రస్తుతం హ్యాపీ కపుల్‌గా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో వీరిపై కంగనా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాలీవుడ్ క్వీన్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘బాలీవుడ్‌లో ఉమెనైజర్‌గా పిలవబడే మరో సూపర్‌స్టార్ నా ఇంటి దగ్గరకు వచ్చి, నన్ను డేట్ చేయమని వేడుకున్నాడు. రహస్యంగా నన్ను దక్కించుకోవడానికి పలు ప్రయత్నాలు చేశాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించినప్పుడు తను ప్రేమించని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకు మూడు సినిమాల ఆఫర్లు వస్తున్నాయని బయటపెట్టాడు. అయినా నేను తనకు నో చెప్పాను. కానీ తను వేర్వేరు అకౌంట్స్ నుండి, నెంబర్ల నుండి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాడు. నేను తనను అన్ని రకాలుగా బ్లాక్ చేశాను. నా ఫోన్ హ్యాక్ అయ్యిందేమో అనుకున్నాను. తన పెళ్లి మాత్రమే కాదు.. బిడ్డ కూడా సినిమాను ప్రమోట్ చేయడంలో భాగమే అని చెప్పాడు. అసలు మనుషులు ఇలా ఉంటారా అని నేను నమ్మలేకపోతున్నాను. వాళ్లు మనుషులు కాదు.. రాక్షసులు. అందుకే వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాను. అధర్మాన్ని నాశనం చేయడమే ధర్మం లక్ష్యం. అదే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.’ అని కంగనా రాసుకొచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీని చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.


హృతిక్‌పై మరోసారి ఆరోపణలు..


కంగనా రనౌత్ మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘ఫిల్మ్ మాఫియా అనేది ఎప్పుడూ క్రిమినల్ యాక్టివిటీస్‌లో భాగంగానే ఉంది. నేను డేట్ చేసిన ఒక సూపర్‌స్టార్.. నేను తనను డేట్ చేయలేదని, తనలాగా ఉండే వేరే వ్యక్తిని డేట్ చేశానంటూ చెప్పుకొచ్చాడు. తను వేర్వేరు నెంబర్ల నుండి, అకౌంట్స్ నుండి నాతో చాట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత నా అకౌంట్‌ను హ్యాక్ చేసి తప్పుడు పనులకు ఉపయోగించడం మొదలుపెట్టాడు. విడాకుల బాధలో అలా చేశాడని అనుకున్నాను. కానీ తన ప్రవర్తనకు విడాకులు కారణం కాదని తెలుసుకున్నాను. వారే తమ సినిమా టికెట్లను భారీగా కొని, కలెక్షన్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తుంటారు. వారు నా వాట్సాప్ సమాచారాన్ని కొని నా కాంట్రాక్ట్స్ గురించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. నాకు పర్సనల్ లైఫ్ అనేది లేకుండా చేస్తున్నారు. వీరు కేవలం టాలెంట్ లేకుండా క్రిమినల్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు మాత్రమే’ అని చెప్తూ తనకు సాయం చేయమని ముంబాయ్ సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేసింది. ఇక ముందుగా రణబీర్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చిన కంగనా.. తర్వాత హృతిక్ మీద కూడా ఆరోపణలు చేసి ఉండొచ్చని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.


Also Read: ర్యాంప్ వాక్ చేసే ముందు బిర్యానీ తినాలా?- ఇదేం సలహా శోభితా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial