యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ బెస్ట్ మూవీస్ లో 'అదుర్స్'Adhurs) కూడా ఒకటి. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010 బాక్సాఫీస్ వద్ద మంచి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సినిమాలో బ్రాహ్మణుడి పాత్రలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతోపాటు బ్రహ్మానందం, ఎన్టీఆర్ ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవడంతో టాలీవుడ్ లోనే ఎవర్ గ్రీన్ మూవీగా 'అదుర్స్' నిలిచిపోయింది. సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించారు. అందులో నరసింహ చారి క్యారెక్టర్ మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. ఆ పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.


ఇప్పటికీ ఈ మూవీ కామెడీ సీన్స్ ని చాలామంది యూట్యూబ్లో రిపీటెడ్ గా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఎవర్ గ్రీన్ మూవీ 'అదుర్స్' ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో చాలా రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అదుర్స్ మూవీ థియేటర్స్ లోకి మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు 'అదుర్స్' మూవీ రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయింది. ఎన్టీఆర్ హీరోగా ఇండ్రస్ట్రీలో 23 ఏళ్ళు విజయవంతగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 18న 'అదుర్స్' మూవీ థియేటర్స్ లో 4k వెర్షన్ తో రీరిలీజ్ కాబోతోంది. సోమవారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడం జరిగింది.






నిజానికి ఈ ఏడాది మార్చి నెలలోనే 'అదుర్స్' రీరిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అప్పట్లో వాయిదా పడింది. దీంతో ఎట్టకేలకు 4k ఫార్మేట్ లో నవంబర్ 18న అదుర్స్ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక 'అదుర్స్' రీరిలీజ్ కాబోతుందనే విషయం తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోసారి బిగ్ స్క్రీన్ పై చారి, భట్టుల నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా హీరోయిన్స్ గా నటించగా.. రమ ప్రభ, షియాజీ షిండే, బ్రహ్మానందం, నాజర్, తనికెళ్ల భరణి, మహేష్ మంజ్రేకర్, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషించారు. వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందించారు.


దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్ లో రీరిలీజ్ కాబోతున్న 'అదుర్స్' మళ్లీ అప్పటి మ్యాజిక్ ని రిపీట్ చేయడం గ్యారెంటీ అని, రీ రిలీజ్ ట్రెండ్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రీ రిలీజ్ ట్రెండ్ లో 'అదుర్స్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. మరోవైపు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ కూడా 'అదుర్స్' సీక్వెల్ చేయాలని తనకు ఎంతో ఆసక్తిగా ఉందని, ఎప్పటినుంచో అదుర్స్ సీక్వెల్ చేయాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. మరి రానున్న రోజుల్లో డైరెక్టర్ వివి వినాయక్ 'అదుర్స్' కి సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.


Also Read : 'స్కంద' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial