ఎంతో కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం కష్టపడుతున్న అక్కినేని వారసుడు అఖిల్ కు 'ఏజెంట్' సినిమాతో తీవ్ర నిరాశే ఎదురైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్.. తొలి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకొని, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఖిల్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడనే దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.

 

నిజానికి 'ఏజెంట్' సెట్స్ మీద వుండగానే అఖిల్ తన తదుపరి చిత్రాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. #Akhil6 మూవీ టాలీవుడ్ బడా బ్యానర్స్ లో ఒకటైన యూవీ క్రియేషన్స్ లలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి అనిల్ కుమార్ అనే ఓ డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

 

అనిల్ కుమార్ గతంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ & రైటర్ గా వర్క్ చేశాడు. ఇప్పుడు అఖిల్ కోసం ఓ అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కథను రెడీ చేశాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని, అఖిల్ కు స్టోరీ బాగా నచ్చిందని ఇన్సైడ్ టాక్. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, ఈ మూవీలో హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేశారట.

 

యూవీ బ్యానర్ లో అఖిల్ చేయబోయే ఫాంటసీ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల మేకర్స్ జాన్వీని సంప్రదించారని.. కథ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 

 

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా 'ధడక్' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తల్లి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. యువ హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో అమ్మడిని ఎప్పటి నుంచో టాలీవుడ్ కు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుండగా.. ఎట్టకేలకు NTR30 ప్రాజెక్ట్ సెట్ అయింది.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చేస్తోంది. నందమూరి వారసుడి సరసన నటిస్తున్న ఈ అందాల భామ.. ఇదే క్రమంలో అక్కినేని వారసుడితో రొమాన్స్ చేయడానికి రెడీ అయిందని.. అఖిల్6 చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ అవకాశాన్ని చేజిక్కించుకుందని అంటున్నారు. 

 

జాన్వీ తల్లి శ్రీదేవి మరియు అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున గతంలో హీరో హీరోయిన్లుగా కలసి నటించారు. ఇప్పుడు జాన్వీ - అఖిల్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కు ట్రీట్ అనే చెప్పాలి. మరి త్వరలోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.