మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) సినిమా టైటిల్ చివరిలో 'అం' (సున్నా) వస్తే సినిమా హిట్ అనేది ఆయన అభిమానులు బలంగా నమ్మే సెంటిమెంట్. ఆయన ప్రతినాయకుడిగా నటించిన 'జయం', 'నిజం', 'వర్షం' సినిమాలే కాదు... హీరోగా పరిచయమైన 'యజ్ఞం'తో భారీ విజయాలు సాధించిన 'రణం', 'లక్ష్యం', 'లౌక్యం' టైటిల్స్ చివరిలో సున్నా ఉంది. ఇప్పుడు ఆయన కొత్త సినిమాకు కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ కానుందని ఫిల్మ్ నగర్ టాక్. 


గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా టైటిల్ అదేనా?
గోపీచంద్ హీరోగా చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా వేణు దోనేపూడి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. దీనికి శ్రీను వైట్ల దర్శకుడు. ఈ సినిమాకు 'విశ్వం' (Viswam Telugu Movie) టైటిల్ పరిశీలనలో ఉందట! కథ ప్రకారం ఆ టైటిల్ అయితే పర్ఫెక్ట్ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది. 


గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో మొదటి చిత్రమిది. అగ్ర హీరోలతో సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన శ్రీను వైట్ల కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. హీరో గోపీచంద్ 32వ చిత్రమిది (Gopichand 32 Movie). 


నిన్న (శనివారం) జరిగిన పూజా కార్యక్రమాల్లో... హీరో గోపీచంద్ మీద చిత్రీకరించిన ముహూర్తపు / తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, కృష్ణ సోదరులు - నిర్మాత ఆదిశేషగిరి రావు, రమేష్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. 


హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్
చిత్ర నిర్మాత వేణు దోనేపూడి (Venu Donepudi) మాట్లాడుతూ ''దివంగత హీరో, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీర్వాదంతో మా చిత్రాలయం స్టూడియోస్ ప్రారంభించాం. అగ్ర హీరోలతో భారీ నిర్మాణ వ్యయంతో సినిమాలు తీయాలనేది మా లక్ష్యం. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా రూపొందిస్తున్నాం. మా సంస్థలో మొదటి చిత్రమిది. అందుకని, ఎక్కడా రాజీ పడటం లేదు. మెజారిటీ సన్నివేశాలను వివిధ దేశాల్లో చిత్రీకరణ చేస్తాం'' అని చెప్పారు.


Also Read తెలుగులో పవన్... తమిళంలో విజయ్... స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!



మళ్ళీ కలిసిన శ్రీను వైట్ల, గోపీ మోహన్!
'విశ్వం' చిత్రానికి ప్రముఖ రచయిత గోపీ మోహన్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. గతంలో శ్రీను వైట్ల తీసిన పలు చిత్రాలకు ఆయన పని చేశారు. 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను' చిత్రాలకు గోపీ మోహన్ స్క్రీన్ ప్లే... 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' వంటి చిత్రాలకు కథలు అందించారు గోపీ మోహన్. అటు హీరో గోపీచంద్ 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకూ పని చేశారు. 


'విశ్వం' చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'ఆర్ఎక్స్ 100', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'మన్మథుడు 2', 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రాలతో ఆయన పాపులర్ అయ్యారు. ఇక, ఈ సినిమాకు కెవి గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 


Also Read షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial