కోలీవుడ్ హీరో కార్తీ బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూకుడుమీదున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో హిట్లు కొడుతున్నాడు. గతేడాది 'సర్దార్', 'పొన్నియన్ సెల్వన్ 1' చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న టాలెంటెడ్ హీరో.. ఇటీవల 'పొన్నియన్ సెల్వన్ 2' తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో 'జపాన్' అనే సినిమాతో ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 


కార్తీ హీరోగా రాజుమురుగన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'జపాన్'. ఇందులో గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు యాక్టర్ సునీల్, దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కు మంచి స్పందన వచ్చింది. నేడు హీరో కార్తీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ 'జపాన్' ఇంట్రో వీడియోని లాంచ్ చేసారు. 


'జపాన్' ఇంట్రో వీడియోని తమిళ్ లో హీరో శింబు, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రిషబ్ శెట్టి రిలీజ్ చేసారు. తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేసి, తన బెస్ట్ విషెస్ ను అందజేశారు. ఈ వీడియోలో 'వాడు పాప క్షమాపణలు అతీతుడు ఫాదర్.. ప్రభువు యొక్క అద్భుతమైన సృష్టిలో వాడొక హీరో' అని చెబుతూ హీరో పాత్రను పరిచయం చేసారు. అతనొక కమెడియన్ అని ఒకరంటే, సునీల్ మాత్రం అతనొక విలన్ అని అంటున్నాడు. 'జపాన్.. మేడ్ ఇన్ ఇండియా' అంటూ కార్తీ చెప్పే విధానం అలరిస్తుంది. 


'జపాన్' లో కార్తీ గెటప్, డ్రెస్సింగ్ స్టైల్, హావభావాలు, డైలాగ్ డెలివరీ.. అన్నీ కొత్తగా ఉన్నాయి. గత చిత్రాల మాదిరిగానే మరో న్యూ కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇందులో సునీల్ కూడా డిఫెరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ కూడా ఒక షాట్ లో కనిపించింది. ఈ ఇంట్రో వీడియోకి విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. 



ఇది కార్తీకి సిల్వర్ జూబ్లీ సినిమా. 'కుక్కూ' 'జోకర్‌' వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన డైరెక్టర్ రాజు మురుగన్‌.. ఈసారి కార్తీతో ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ లో ఎస్‌ఆర్‌. ప్రకాశ్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, రవి వర్మన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 


ఇకపోతే 'జపాన్' చిత్రాన్ని 2023 దీపావళి సందర్భంగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గతేడాది అదే సీజన్ లో 'సర్దార్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు కార్తీ. ఈసారి పండక్కి మరో సక్సెస్ సాధిస్తారని అభిమానులు నమ్ముతున్నారు. కాకపోతే అదే సమయంలో మరో మూడు క్రేజీ మూవీస్ రిలీజ్ ప్లాన్ చేసుకుని ఉన్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య నటిస్తున్న 'జిగర్తండా 2', శివ కార్తీకేయన్ 'అయలన్' చిత్రాలతో పాటుగా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' సినిమాలు రాబోతున్నాయి. మరి వీటిల్లో ఫైనల్ గా ఏవేవి బరిలో నిలుస్తాయో వేచి చూడాలి.