Guntur Kaaram Kurchi Madatha Petti song : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం' పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా పాటలను విడుదల చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకోగా తాజాగా మూడో పాటకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ కి ఈ సాంగ్ నచ్చడం అనే విషయాన్ని పక్కన పెడితే ఎవరు ఊహించని విధంగా ఈ పాట కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది.


ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు తన సినిమాలో ఇలాంటి పాటను ఎలా అంగీకరించాడా? అని చాలామంది నెటిజన్స్ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే మహేష్ బాబు లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో ఇలాంటి బూతు పదాలతో కూడిన పాట పెట్టడం ఏంటని మూవీ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో.. ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్‌తో పాపులరైన తాత గురించి.. ఈ సాంగ్ కోసం అతడికి ఇచ్చిన రెమ్యూనరేషన్ గురించి డిస్కషన్ నడుస్తోంది.


హైదరాబాదులోని కాలా పాషా అనే ఓ తాత గతంలో ఇంటర్వ్యూలో తన జీవితం గురించి చెబుతూ 'కుర్చీ మడత పెట్టి' అనే బూతు పదంతో కూడిన డైలాగ్ ని వాడాడు. ఇది సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా బాగా వైరల్ అయింది. దాంతో ఈ డైలాగ్ కాస్త ఫేమస్ అయిపోయింది. ఎంతలా అంటే ఈ తాత అసలు పేరును మరిచిపోయి అందరూ కుర్చీ తాత అని పిలవడం మొదలు పెట్టేంతలా ఈయనకి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అతని మాటల్ని పాటగా మార్చేసాడు తమన్. అయితే ఇందుకు కుర్చీ తాతకు తమన్ ఐదు వేల రూపాయలు ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా కుర్చీ తాత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక తాత మాటలని మాస్ సాంగ్ గా మార్చి తాజాగా రిలీజ్ చేసిన కుర్చీ మడతపెట్టి ప్రోమో సాంగ్ లో మహేష్, శ్రీ లీల మాస్ స్టెప్పులు బాగానే వేసినప్పటికీ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు.


దీంతో సోషల్ మీడియా అంతటా గుంటూరు కారం మూవీ టీం పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. జస్ట్ ప్రోమోకే ఈ రేంజ్ నెగిటివిటీ అందుకుంటున్న టీం సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకెలాంటి విమర్శలు ఎదుర్కొంటారో చూడాలి. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ దానిపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


Also Read :'కుర్చీ మడత పెట్టి' సాంగ్ పై ట్రోల్స్ - స్పందించిన నిర్మాత!