ప్రస్తుతం ప్రతీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఎప్పుడో విడుదలయిన సినిమాలకు కూడా సీక్వెల్స్‌ను తెరకెక్కించడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. అలాగే 2014లో అంజలి హీరోయిన్‌గా తెరకెక్కించిన హారర్ మూవీ ‘గీతాంజలి’కి కూడా సీక్వెల్ సిద్ధమయ్యింది. ఇప్పటికే ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ అనౌన్స్‌మెంట్ తర్వాత మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక 2024 న్యూ ఇయర్ సందర్భంగా ‘గీతాంజలి’కి సీక్వెల్ అయిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌తో ‘చంద్రముఖి’ పోజ్‌ను గుర్తుచేసింది మూవీ టీమ్.


మలయాళ నటుడు హీరోగా..
హారర్ కామెడీ చిత్రాలు ట్రెండ్‌ను క్రియేట్ చేస్తూ.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ సాధిస్తున్న సమయంలోనే ‘గీతాంజలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిగతా చిత్రాలలాగానే హారర్ కామెడీ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ మూవీకి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ తెరకెక్కుతుండడంతో.. ఈ సీక్వెల్‌పై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో హీరోగా మలయాళ నటుడు రాహుల్ మాధవ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం తెరకెక్కుతోంది. ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


అంజలి కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీ..
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. అంజలి కెరీర్‌లో 50వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికిపైగా పూర్తయ్యిందని మేకర్స్ చెప్తున్నారు. అందుకే న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అంజలి క్లాసికల్ డ్యాన్సర్‌గా కనిపిస్తుండగా.. ఒక పాతబడిన బిల్డింగ్‌లో తను డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఇక ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ పోస్టర్‌లో అంజలి పోజ్‌ను చూస్తుంటే అచ్చం చంద్రముఖి పాపులర్ పోజ్‌లాగా ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఈ మూవీని సమర్పిస్తున్న కోన వెంకట్‌తో సహా నిర్మాతలు ఎంవీవీ సత్యనారాయణ, జీవీలు కూడా బడ్జెట్‌ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దీనిని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 


ఇది మరో ఎత్తు..
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘గీతాంజలి’ సీక్వెల్‌లో మొదటి భాగంలో నటించిన నటీనటులు కూడా కనిపించబోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలు ఒక ఎత్తైతే.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మరో ఎత్తు అని మేకర్స్ అంటున్నారు. నిన్ను కోరి, నిశ్శ‌బ్దం చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ శివ తుర్ల‌పాటి.. ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.


Also Read: వివాదాలకు విరామం, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ ఫిక్స్