జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘దేవర’ రిలీజ్‌కు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దీంతో ‘దేవర’ దానికి మించి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.


ఊరించి మరీ షాకిచ్చిన ‘దేవర’ టీమ్


‘దేవర’ నుంచి అప్‌డేట్ ఉంటుందని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో తప్పకుండా మూవీకి సంబంధించిన గ్లింప్స్ గానీ, ప్రోమోగానీ రిలీజ్ చేస్తారని భావించారు. కానీ, అలా కాలేదు. కేవలం మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సారి ఆ పోస్టర్‌లో ఎన్టీఆర్ లుక్‌ను పూర్తిగా రివీల్ చేశారు. ‘దేవర’ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్‌లో అదొక్కటే మార్పు. తాజా పోస్టర్‌తో గ్లింప్స్ తేదీని ప్రకటించడం ఒక్కటే చిన్న ఊరట. న్యూ ఇయర్ సందర్భంగా ‘దేవర’ టీమ్ తమ అభిమానులకు ఈ విధంగా గుడ్ న్యూస్ చెప్పారు. అయితే, కనీసం చిన్న వీడియో గ్లింప్స్ లేదా ప్రోమోలాంటిది వదిలినా బాగుండేది కదా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 






‘దేవర’ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇకపై అప్‌డేట్స్‌తో అభిమానులకు టచ్‌లో ఉండాలనేది మేకర్స్ ప్లాన్. ఈ నేపథ్యంలో జనవరి 8న గ్లింప్స్ విడుదల చేసి.. సంక్రాంతి రోజున టీజర్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, టీజర్ ఎప్పుడనేది కూడా ఆ గ్లింప్స్‌లోనే అనౌన్స్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా గ్లింప్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మార్చి నెలలో టీజర్, రిలీజ్ టీజర్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. 


సముద్రం బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తు్న్నారు. ఇందులో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రభినయం చేస్తున్నారట. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. జాన్వీ ఇప్పటికే శ్రీదేవి కూతురిగా బాలీవుడ్​లో మంచి పేరు తెచ్చుకుంది. తన కూతురు దక్షిణాది సినిమాల్లో కూడా నటించాలనే శ్రీదేవి కోరికను నెరవేర్చేందుకు జాన్వీ.. ఈ ఆఫర్‌ను వెంటనే అంగీకరించింది. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ మంచి క్రేజ్ సంపాదించిన నేపథ్యంలో.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాలనేది జాన్వీ కోరిక. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 


Also Read: అలా అనిపించకుండా చేస్తాం అన్నారు - ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్ ఎక్స్‌పీరియన్స్ బయటపెట్టిన తృప్తి