Krishnam Raju Birth Anniversary on 20th: రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు దివంగత కృష్ణంరాజు గారి జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు. ఈ మేరకు కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పేదల కోసం స్థానికంగా ఉన్న శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నట్టు తాజాగా తెలిపారు. ఈ వైద్య శిబిరం కృష్ణం రాజు గారు, డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డా.వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఉచిత వైద్యలు సేవలు అందించనున్నారు.


అందుకే కోసమే ఈ వైద్య శిబిరం: శ్యామలా దేవి


ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటిస్ తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని కృష్ణంరాజు గారి భార్య, ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవి తెలిపారు. మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవాలి ఆమె సూచించారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ.. "కృష్ణం రాజు గారి జయంతి వేడుకలను ఆయనకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో చేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరానికి విదేశాల నుంచి పలువురు వైద్యులు వస్తున్నారు. ఇక్కడి ప్రజలంతా ఈ వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలి. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, బాబు ప్రభాస్ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు వెయ్యి మంది దాకా ఈ వైద్య శిబిరానికి వస్తారని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు. 


కాగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు 2022 నవంబర్‌ 9న అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు సొంతూరైన మొగల్తూరులో 20 జనవరి 1940లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.