శుక్రవారం వచ్చిందంటే చాలు.. సినీ లవర్స్‌కు పండగే. ఎంతోమంది సినీ తారల భవిష్యత్తు శుక్రవారంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక పండగ సీజన్స్‌లో వచ్చే శుక్రవారాలు సినీ పరిశ్రమకు మరింత ముఖ్యం. ఇలాంటి సమయాల్లోనే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి సినిమాలు చూడడానికి ముందుకొస్తారు. అయితే ఎక్కువశాతం శుక్రవారాలు అనేవి హీరోల ఫేట్‌ను డిసైడ్ చేస్తాయి. కానీ ఈ శుక్రవారం (నవంబర్ 17) మాత్రం పలువురు హీరోయిన్స్ ఫేట్‌ను డిసైడ్ చేయనుంది. ఒకప్పుడు హిట్లు కొట్టి ప్రస్తుతం కెరీర్‌ను కష్టంగా ముందుకు కొనసాగిస్తున్న పలువురు హీరోయిన్స్.. శుక్రవారం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.


పాయల్ ఆశలన్నీ ‘మంగళవారం’పైనే..
నవంబర్ 17న పలు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవ్వగా.. అందులో అన్నింటికంటే కాస్త ఎక్కువ బజ్‌ను క్రియేట్ చేసిన చిత్రం ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్ 100’ లాంటి సెన్సేషనల్ హిట్‌తో తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టిన పాయల్ రాజ్‌పుత్‌కు ఆ మూవీ తర్వాత పెద్దగా హిట్స్ లేవు. అందుకే ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతితోనే మరో హిట్ కొట్టేందుకు సిద్ధమైంది. ‘మంగళవారం’ చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది పాయల్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అంశం ప్రేక్షకులను ఆకట్టుకొని థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే ఆడియన్స్‌లో బాగా హైప్ క్రియేట్ చేసింది. ‘మంగళవారం’ హిట్ అందుకుంటేనే పాయల్‌కు మళ్లీ పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.


ఒకే సినిమాపై ఆధారపడ్డ ఇద్దరు ముద్దుగుమ్మలు..
‘మంగళవారం’తో పాటు ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతున్న మరో సినిమా ‘స్పార్క్’. ఈ సినిమాకు విక్రాంత్ రెడ్డి దర్శకత్వం వహించడంతో పాటు తనే హీరోగా కూడా నటించాడు. విక్రాంత్ అంటే ఎవరో ప్రేక్షకులకు తెలియకపోయినా.. మెహ్రీన్, రుక్సార్ లాంటి హీరోయిన్లను క్యాస్ట్ చేయడంతో ‘స్పార్క్’ సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసింది. పైగా ఈ మూవీ ప్రమోషన్‌లో ఈ ఇద్దరు హీరోయిన్స్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో, హిట్లతో దూసుకుపోయిన మెహ్రీన్ కెరీర్.. గత కొన్నాళ్లకు అంత వేగంగా సాగడం లేదు. దీంతో ‘స్పార్క్’ మూవీ హిట్ అవ్వడం మెహ్రీన్‌కు మాత్రమే కాదు.. రుక్సార్‌కు కూడా ముఖ్యమే.


పోటీలో ఒక డబ్బింగ్ చిత్రం..
హన్సిక ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించి.. ఇతర హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది. కానీ తను తెలుగు తెరపై కనిపించడం మానేసి చాలాకాలమే అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే ఒక థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హన్సిక తెలుగులో మళ్లీ బిజీ అవుతుందా లేదా అనేది ఈ మూవీ రిజల్ట్‌పైనే ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన డబ్బింగ్ చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ కూడా ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు సీక్వెల్ కూడా హిట్‌ను సాధిస్తే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు తెలుగులో కూడా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: పాయల్‌కు ఫోన్ చేసి సీరియస్ అయిన దర్శకుడు అజయ్, అసలు విషయం ఏంటంటే?