పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాకి వచ్చేసాడు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత డార్లింగ్ హైదరాబాదులో అడుగుపెట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన కొన్ని ఫోటోలు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో నెటిజన్స్ ఈ ఫోటోల పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'సలార్ ఆగయా' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, 'సలార్ ఆగమనం' అంటూ మరో నెటిజన్ రాసుకోవచ్చాడు. ‘‘రాజు తిరిగి తన రాజ్యంలో అడుగుపెట్టాడంటూ’’ మరో నెటిజన్ పేర్కొన్నాడు.


ప్రభాస్ తిరిగి హైదరాబాద్‌కు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తాజాగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసిన ప్రభాస్ త్వరలోనే సలార్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. 'సలార్' మూవీని డిసెంబర్ 22న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసినా ఇప్పటివరకు మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ విషయంలో ఫ్యాన్స్ కొంత నిరాశకు లోనవుతున్నారు. దానికి తోడు సలార్ మరోసారి వాయిదా పడబోతుందనే వార్తలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ప్రభాస్ రాకతో ఫ్యాన్స్ ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు.






విదేశాల నుంచి తిరిగి వచ్చేసిన ప్రభాస్ త్వరలోనే మూవీ టీం తో కలిసి 'సలార్' ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని నెలలుగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న ప్రభాస్ సర్జరీ కోసం ఇటీవల యూరప్ లోని ఇటలీకి వెళ్ళిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలోనే మోకాలు నొప్పికి సంబంధించిన సర్జరీ పూర్తి చేసుకున్నాడు ప్రభాస్. కానీ కంప్లీట్ రెస్ట్ తీసుకోవాల్సి ఉండడంతో గత మూడు నెలల నుంచి ఇటలీలోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. సుమారు మూడు నెలల తర్వాత ప్రభాస్ ఇండియాకి తిరిగి రావడంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఇక 'సలార్' విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. కంప్లీట్ గ్యాంగ్ స్టర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు 'సలార్' ప్రమోషన్స్ తో పాటు మరోవైపు తన తదుపరి సినిమా షూటింగ్ లపై కూడా ఫోకస్ చేయనున్నారట ప్రభాస్.


ఈ క్రమంలోనే నవంబర్ 13 నుంచి మారుతి మూవీ షూటింగ్లో ప్రభాస్ పాల్గొన్నట్లు తెలిసింది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది. ప్రభాస్ లేకుండా మిగిలిన ప్రధాన తారాగణం పై డైరెక్టర్ మారుతి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ 'కల్కి 2898AD' మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కూడా త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద మూడు నెలలు రెస్ట్ తీసుకున్న ప్రభాస్ త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీ కానున్నాడు.