తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు (Editor Gautham Raju) కన్ను మూశారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు 900 వందలకు పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పని చేశారు. ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోలుగా ఉన్న వారందరితో ఏదో ఒక చిత్రానికి పని చేశారు. గౌతమ్ రాజు మృతితో పలువురు ప్రముఖులు షాక్‌కి గురి అయ్యారు. తమకు దిగ్బ్రాంతి కలిగించిందని పేర్కొంటున్నారు. 


బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో గౌతమ్ రాజు తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా వారం రోజుల క్రితం నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ... ఈ రోజు తెల్లవారుజామున తిరిగి రాని లోకాలకు వెళ్లారు.


గౌతమ్ రాజుకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి అత్తగారి ఊరు కాకినాడ. అల్లుడు, అమ్మాయి హైదరాబాద్, నిజాం పేటలో నివాసం ఉంటున్నారు. చిన్నమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటున్నారు. తండ్రికి అనారోగ్యంగా ఉందని తెలిసిన వెంటనే చిన్నమ్మాయి ఇండియా వచ్చారు.


మోతీనగర్‌లోని గౌతమ్ రాజు నివాసం వద్ద ఆయన పార్ధీవ దేహం ఉంది. పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 


మెగాస్టార్ చిరంజీవి 'చట్టానికి కళ్లులేవు' సినిమాతో గౌతమ్ రాజు ఎడిటర్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర హీరోల చిత్రాలకు సేవలు అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాలు చేశారు. బాలకృష్ణ 'లెజెండ్', పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్', 'గోపాల గోపాల', ఎన్టీఆర్ 'అదుర్స్', అల్లు అర్జున్ 'రేసు గుర్రం', రవితేజ 'కిక్', అక్కినేని నాగచైతన్య 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 


Also Read : 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' ఎడిటర్‌గా గౌతమ్ రాజు చివరి చిత్రమని చెప్పాలి. ప్రస్తుతం 'శాసన సభ' అనే చిత్రానికి ఆయన పని చేస్తున్నప్పటికీ... ఆ సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. 


Also Read : ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'