అప్పటి వరకూ హాలీవుడ్ సినిమాలకే పరిమితమైన సూపర్ హీరో కాన్సెప్ట్ ని, భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం 'క్రిష్'. రాకేష్‌ రోషన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యాండ్సమ్ హాంక్ హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించాడు. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 'కోయి మిల్‌ గయా’ సినిమాతో ఈ ఫ్రాంచైజీ మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ వచ్చిన మూడు సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. సూపర్‌ హీరో సినిమా అంటే క్రిష్‌ అనే విధంగా బలమైన ముద్ర వేసాయి. అయితే వీటికి కొనసాగింపుగా నాలుగో భాగం ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రాకేష్‌ రోషన్‌ తాజాగా ఓ అప్‌డేట్‌ అందించారు.


 ‘క్రిష్ 4’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక సార్లు వార్తలు వైరల్ అయ్యాయి. 'కోయి మిల్‌ గయా’ మూవీ వచ్చి ఆగస్టు 8వ తేదీకి 20 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20న ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇండియన్ సూపర్ హీరో మూవీ నాలుగో భాగం గురించి మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై రాకేశ్ రోషన్ మాట్లాడుతూ.. ''ఈ జెనరేషన్ పిల్లలు హాలీవుడ్ సూపర్‌ హీరో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. వాటిని మిలియన్‌ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కస్తున్నారు. వాటికి అలవాటు పడిన ప్రేక్షకులు రెండు వందల కోట్ల రూపాయలతో తీసే క్రిష్‌ సినిమాను ఆదరిస్తారా? అని నాకు డౌట్ గా ఉంది'' అని అన్నారు. 


''క్రిష్‌-4 కచ్చితంగా ఓ భారీ బడ్జెట్‌ మూవీ అవుతుంది. కానీ 10 సినిమాలకు బదులు నాలుగే తీయాలని నిర్ణయించుకున్నాను. ఈరోజుల్లో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా సినిమా లేకపోతే థియేటర్లకు రావడం మానేస్తున్నారు. ఒక పెద్ద సినిమా ప్లాప్ అయితే కనీసం దాని ప్రొడక్షన్‌ ఖర్చులు కూడా రావడం లేదు. ఇలాంటి ఆందోళన కలిగించే విషయాలు నాకు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ 'క్రిష్‌' నాలుగో భాగాన్ని రూపొందించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అయితే దానికి కొంత సమయం పట్టొచ్చు. వచ్చే ఏడాదిలో మొదలయ్యే అవకాశం ఉంది'' అని రాకేష్‌ రోషన్‌ తెలిపారు. 


Also Read: క్రేజీ అప్డేట్స్‌తో రాబోతున్న స్టార్ హీరోలు, ఈ నెల ఫ్యాన్స్‌కు పండగే పండగ!


కాగా, 2003 లో వచ్చిన 'కోయి మిల్ గయా' సినిమా సక్సెస్ అవ్వడంతో, దానికి సీక్వెల్ గా 2006లో 'క్రిష్' చిత్రాన్ని రూపొందించారు. దాదాపు రూ.40 కోట్లతో తీసిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర రూ.120 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2013లో 'క్రిష్ 3' మూవీ వచ్చింది. ఇది దాదాపు రూ.400 కోట్లు కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా ఈ ప్రాంచైజీ సూపర్ సక్సెస్ అవడంతో సినీ అభిమానులందరూ 'క్రిష్ 4' కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై రాకేష్ రోషన్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. నాలుగో భాగం మరింత అడ్వాన్స్ గా తీసే ఆలోచనలో ఉన్నామని ఓ సందర్భంలో తెలిపారు. అయితే ఇది 2024లో ఉండొచ్చని ఇప్పుడు తాజాగా వెల్లడించారు. 


ఇదిలా ఉంటే, హృతిక్‌ రోషన్‌ ప్రస్తుతం 'వార్' ఫేమ్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఏరియల్ యాక్షన్ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో 'వార్ 2' చేయనున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


Also Read: ప్ర‌భుదేవా, అనసూయల 'వూల్ఫ్' టీజర్ - ఆకలితో ఉన్న తోడేలు వేట ప్రారంభం!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial