టాలీవుడ్ లో జులై బాక్సాఫీస్ సందడి ముగిసింది.. ఆగస్ట్ సినీ సందడి మొదలైంది. ఈ నెలలో అనేక క్రేజీ చిత్రాలు థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉన్నాయి. సినీ ప్రియుల కోసం వారానికో రెండు మూడు సినిమాల చొప్పున విడుదల కాబోతున్నాయి. చిరంజీవి, రజినీకాంత్ లాంటి సీనియర్ హీరోలు బరిలో దిగుతున్నారు. ఓవైపు కొత్త సినిమాల రిలీజుల హడావిడి నడుస్తుంటే, మరోవైపు పలు భారీ చిత్రాల అప్డేట్స్ కూడా సిద్ధమవుతున్నాయి. 


ఆగస్టులో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల పుట్టిన రోజులు ఉన్నాయి. బర్త్ డే స్పెషల్ గా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ మెంట్స్ రాబోతున్నాయి. అభిమానులను ఉత్సాహ పరచటానికి ప్రస్తుతం వారు నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. అలానే ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


మహేశ్‌ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే కృష్ణ బర్త్ డేకి రిలీజైన టైటిల్ గ్లిమ్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే మహేష్ పుట్టిన రోజైన ఆగస్టు 9న మరో అప్డేట్ వస్తుందని టాక్. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఎస్.ఎస్ రాజమౌళితో చేయబోయే SSMB29 ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. అదే జరిగితే 'బిజినెస్ మ్యాన్' రీ రిలీజ్ తో ఖుషీ అవుతున్న ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. 


Also Read: 'బ్రో' ఎఫెక్ట్ - 'భోళా శంకర్' విషయంలో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారా?


చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతోంది. దీని కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే నెలలో వారికి మరొక పెద్ద పండుగ రాబోతోంది. అదే ఆగస్టు 22.. చిరు పుట్టిన రోజు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరగనున్నాయి. వారి ఎగ్జైట్మెంట్ ను రెట్టింపు చేయడానికి మెగా న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణంలో చిరంజీవి తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు. 'బంగార్రాజు' ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నెలలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. 
 
'ఘోస్ట్' సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన తర్వాత అక్కినేని నాగార్జున ఇంతవరకూ తన కొత్త చిత్రాన్ని ప్రకటించడలేదు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ, ఓ మలయాళ రీమేక్ లో నటించనున్నారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అలానే 'Rx 100' అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారని కూడా టాక్ వచ్చింది. లేటెస్టుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం 'బిగ్ బాస్' సన్నాహకాల్లో బిజీగా ఉన్న నాగ్.. వీలైనంత త్వరగా తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేయాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆగస్టు 29న జరుగుతుందని భావిస్తున్నారు. 


మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' అప్డేట్ కూడా ఈ నెలలో ఉంటుందని అంటున్నారు. ఆగస్టు 17న డైరెక్టర్ శంకర్ బర్త్ డే ఉంది కాబట్టి, ఆ రోజు దిల్ రాజు బ్యానర్ నుంచి ఏదైనా స్పెషల్ పోస్టర్ వస్తుందని అభిమానులు వేచి చూస్తున్నారు. అదే రోజు హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో, పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా నుంచి ఒక పిక్ రిలీజ్ చెయ్యాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ - KGF ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ 'సలార్‌'. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని 'సలార్‌: సీజ్‌ ఫైర్‌' పేరుతో సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన టీజర్ దుమ్మురేపింది. అయితే విడుదల దగ్గర పడుతుండటంతో ఈ నెలలో ఒక సాంగ్ ను వదలాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఇదే నెలలో తేజ సజ్జా, విశాల్ లాంటి మరికొందరు హీరోల బర్త్ డేలు ఉన్నాయి. వారు నటించే 'హనుమాన్' 'మార్క్ ఆంటోనీ' సినిమాల అప్డేట్స్ రానున్నాయి.


Also Read: విశ్వక్ సేన్ 'నో' చెప్పిన విధానం నచ్చలేదు.. వివాదంపై నోరువిప్పిన 'బేబీ' డైరెక్టర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial