Meher Ramesh Meets Chiranjeevi: కొందరు దర్శకులు, హీరోల కాంబినేషన్స్ అంటే ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుంది. అలాగే నచ్చిన కాంబినేషన్స్ ఉన్నట్టుగానే అస్సలు నచ్చని కాంబినేషన్స్ కూడా ఉంటాయి. టాలీవుడ్‌లో అలాంటి కాంబినేషన్ ఒకటి చెప్పమంటే మెహర్ రమేశ్, చిరంజీవి అని చెప్తారు చాలావరకు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్ కలిసి ‘భోళా శంకర్’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ చిరు కెరీర్‌లోనే ఘోరమైన డిజస్టర్‌ను మూటగట్టుకుంది. ఇక తాజాగా ‘విశ్వంభర’ మూవీ సెట్స్‌లో చిరును కలిశాడు మెహర్ రమేశ్. దీంతో మళ్లీ కలిసి సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఆందోళన మొదలయ్యింది.


ఘోరమైన డిసాస్టర్..


హీరో కెరీర్ అంటే హిట్లతో పాటు ఫ్లాప్స్ కూడా ఉంటాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో కూడా ఉన్నాయి. కానీ ఆయన ఇన్నేళ్ల కెరీర్‌లో ‘భోళా శంకర్’లాంటి డిసాస్టర్ మాత్రం ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఈ మూవీ మొదటి రోజు మొదటి షో నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ సైతం దీనిపై కనీసం పాజిటివ్ రివ్యూలను ఇవ్వలేకపోయారు. చిరు హీరోగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుండి ఎక్కువగా రీమేక్స్‌తోనే కాలం గడిపేస్తున్నారు. ఇక రీమేక్స్ చాలు అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నా కూడా పట్టించుకోకుండా మెహర్ రమేశ్‌తో ‘భోళా శంకర్’ తెరకెక్కించారు. అప్పటికే తెలిసిన కథను మరింత దారుణంగా హ్యాండిల్ చేసి దర్శకుడిగా మెహర్ ఫెయిల్ అయ్యారని ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేశారు.


ఫ్యాన్స్‌లో ఆందోళన..


2023లో వచ్చిన ‘భోళా శంకర్’ రిజల్ట్ నుండి బయటికొచ్చి చిరంజీవి.. తన అప్‌కమింగ్ మూవీ ‘విశ్వంభర’తో బిజీ అయ్యారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్టతో చిరు చేస్తున్న మూవీ ఇది. అయితే తాజాగా మెహర్ రమేశ్.. ఈ మూవీ సెట్స్‌కు వెళ్లి మరీ చిరును కలిశారు. దీంతో మళ్లీ వీరు కలిసి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా అని ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. కొంపదీసి మరో రీ‘మేకు’ దింపడానికి కాదు కదా అని ట్రోల్ చేస్తున్నారు. అలా అనుకుంటారనే మెహర్ రమేశ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను గమనిస్తే అసలు విషయం ఏంటో అర్థమవుతోంది. ‘విశ్వంభర’ సెట్స్‌కు వెళ్లి చిరును కలిసిన మెహర్ రమేశ్.. అసలు ఎందుకు కలిశాడో క్యాప్షన్‌లో క్లారిటీ ఇచ్చాడు.






అందుకే కలిశాం..


‘పద్మవిభూషణ్, మెగాస్టార్, అన్నయ్య చిరంజీవిని కలిశాను. ఎల్బీ స్టేడియంలో మే 4న జరగనున్న ‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే’ ఈవెంట్‌కు ఆహ్వానించాను. టీఎఫ్డీఏ ప్రెసిడెంట్ వీరశంకర్, సాయి రాజేశ్, అనుదీప్, శ్రీరామ్ ఆదిత్య, సుబ్బారెడ్డితో కలిసి వెళ్లి ఆయనను విశ్వంభర సెట్స్‌లో కలిశాం’ అని వివరణ ఇచ్చాడు మెహర్ రమేశ్. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మెహర్ రమేశ్, చిరంజీవి కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే మళ్లీ మెహర్‌తో సినిమా మాత్రం చేయొద్దని మెగాస్టార్‌ను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ను ‘బింబిసార’ తరహాలోని ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రంగా సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు వశిష్ట.



Also Read: ఎన్నికల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌‌కు మద్దతుపై స్పందించిన హీరో న‌వ‌దీప్ - వాళ్లకు టార్గెట్ అవ్వడు కదా?