ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం 'బలంగం'. మంచి కథ ఉంటే చాలు, కమర్షియల్ హంగులు - స్టార్ క్యాస్టింగ్ అవసరం లేదని నిరూపించింది. తెలంగాణ పల్లె సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాదు.. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకుంది.

 

అగ్ర నిర్మాత దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'బలగం' సినిమా రూపొందింది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హర్షిత్, హన్షితలు నిర్మించారు. ఇందులో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతుంది. పల్లెటూళ్లలో ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసుకుని మరీ ఊరు ఊరంతా కలిసి ఈ సినిమాను చూస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. 

 

అలాగే 'బలగం' సినిమాకు ఇప్పటి వరకూ 7 ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు సొంతం చేసుకుంది. తెలుగు సినిమా ఉగాది పురస్కారాల్లో ‘నంది’ అవార్డును కూడా దక్కించుకుంది. ఇక బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉక్రెయిన్ ‘ఒనికో ఫిల్మ్ అవార్డు’ను సొంతం చేసుకుంది. వీటితో పాటుగా మరో మూడు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.

 

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మంచి సినిమా తీస్తున్నామని, మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో 'బలగం' సినిమాను మొదలు పెట్టాం. కానీ ఈరోజు అదొక చరిత్ర. తెలుగు సినిమాలో బలగం ఓ మైలురాయిలా నిలబడిపోయేలా ముందుకెళుతోంది. సినిమా విడుదలై 5 వారాలు అవుతున్నప్పటికీ సినిమా గురించి రోజూ ఏదో ఒక వార్తలు వింటూనే ఉన్నాం. సినిమా వాళ్లే కాకుండా మినిష్టర్స్, ఎమ్మెల్యేలు వీళ్లు వాళ్లు అని కాకుండా అప్రిషియేట్ చేశారు. నా నెంబర్ లేకపోతే అడిగి మరీ తీసుకుని మాట్లాడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'బలగం' ఎప్పుడూ నిలబడిపోయే ఓ చరిత్ర. ఇప్పుడు పల్లె పల్లెలో మీ బలగం మారు మోగుతోంది" అని అన్నారు.

 

"బలగం సినిమా గురించి వేణు చెప్పినప్పుడు ఇదొక మంచి ప్రయత్నమని చేశాం. ఈరోజు అదే సినిమా ద్వారా విడిపోయిన కుటుంబాలు కలుస్తున్నారయి. ముందుగా వేణుకి థాంక్యూ. తెలుగు సినిమా చరిత్రలో బలగంకు ఓ పేజీ ఉంటుంది. పల్లెటూళ్లలో బలగం సినిమా షో ఉంటుందని ఇన్వెటేషన్ రెడీ చేసుకుని మరీ చూస్తున్నారు. ఇలాంటి మూమెంట్ మళ్లీ ఎప్పుడు చూస్తామో తెలియదు. ఇక థియేటర్స్ లో 5 వారాలైనప్పటికీ ఇంకా షేర్ కలెక్షన్స్ రావటం గొప్ప విషయం'' అని దిల్ రాజు చెప్పారు.

 

ఇంకా దిల్ రాజు మాట్లాడుతూ.. "ఏప్రిల్ 5వ తేదీకి నిర్మాతగా నేను జర్నీ స్టార్ట్ చేసి 20 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో 'బొమ్మరిల్లు' సమయంలో నాకొక అనుభూతి. ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ లో మార్పు వచ్చింది. ఇప్పుడు బలగం సినిమా వల్ల విడిపోయిన వారు ఫ్యామిలీ మెంబెర్స్ కలుస్తున్నారు'' అని అన్నారు. బలగం సినిమాను రిలీజ్ చేయటాని కంటే ముందే హర్షిత్, హన్షితలు పలు ఇంటర్నేషనల్ అవార్డులకు పంపారని.. 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయని చెప్పారు. "20 ఏళ్లలో 50 సినిమాలు చేశాను. ఇన్నేళ్లో ఏ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్ రాలేదు. ఫస్ట్ టైమ్ వస్తుంది. మా పిల్లలు ఇంటర్నేషనల్ కు వెళ్లారు. ఇప్పుడు వాళ్ల రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగింది" అని దిల్ రాజు పేర్కొన్నారు.

 

సీనియర్ నటుడు మోహన్ బాబు ఫోన్ చేసి ఏం సినిమా తీశారయ్యా అని అప్రిషియేట్ చేశారని.. హర్షిత్, హన్షితలు వెళ్లి ఆయన్ని కలిసొచ్చారుని దిల్ రాజు చెప్పారు. సినిమా ఇండస్ట్రీతో పాటు అటు రాజకీయ నాయకులు సైతం 'బలగం' సినిమాను అభినందిస్తున్నారని.. ఈ చిత్రంతో బాధ్యత పెరిగిందని అన్నారు. టీమ్ అంతా కష్టపడి ఇష్టపటి చేశారు కాబట్టి ఓ అద్భుతం జరిగింది. ఇలాంటి అద్భతం చేస్తామో చూడాలి. ఇప్పటికే అన్వేషణ స్టార్ట్ అయ్యిందన్నారు.

 


 

"పల్లెటూళ్లలో షోను ఆపుతున్నామంటూ వార్తలు వస్తున్నాయి. జనాలు ఎలాగైనా మంచి సినిమాను చూడాలనే బలగం ను రూపొంచాం. మంచి సినిమా చేశామని అనుకున్నాం కానీ.. గొప్ప సినిమా చేశామని ఇప్పుడే తెలిసింది. మా ద్వారా కుటుంబాలు కలిసి పోతున్నాయి. సోసైటీ మార్పు వస్తుందంటే అంత కంటే గొప్ప ఏముంది. మా జన్మ ధన్యమైంది. కానీ మేం ఏదో లీగల్ గా సినిమాను ఆపేస్తామని వార్తలు వస్తున్నాయి. నిజానికి నిర్మాతగా డిజిటల్ హక్కులను ఓటీటీ వాళ్లకి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ల సైడ్ నుంచి మాకు ప్రెషర్ వచ్చింది. వాళ్లు మెయిల్ పెట్టారు. దాని కోసం మా లీగల్ టీమ్ ఏదో చేసింది కానీ.. ఇది ఆగదు. నేను చెప్పేది ఒక్కటే ఈ సినిమా ఎక్కడా ఆగదు. ఓపెన్ గా ఎక్కడ ఎలా చూడాలనుకుంటే అలా చూడండి. ఎక్కడైనా సినిమా చూడాలనుకుంటే మేం కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. మేం షోస్ అరెంజ్ చేస్తాం. నాకొస్తున్న పేరుని ఓ బ్యాచ్ తట్టుకోలేదు. వెంటనే ఏదో స్టార్ట్ చేస్తారు. నేను నిజాయతీగా ఉన్నాను. భయపడాల్సిన అవసరం లేదు" అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

 

అకాడమీ అవార్డుకు పంపించే విషయమై దిల్ రాజు మాట్లాడుతూ.. ''బలగం' సినిమాను ఆస్కార్ కు కచ్చితంగా పంపించేలా చర్యలు తీసుకుంటాం. ఏదో బడ్జెట్ పెట్టాలనే వార్తలు వచ్చాయి. నేను కూడా కార్తికేయతో దాని గురించి మాట్లాడాను. నిజానికి యుఎస్ లో స్ట్రీమింగ్ చేయటానికి కొంత బడ్జెట్ పెట్టాలి. అదే వాళ్లు పెట్టారు. ఇక ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫెంట్ సినిమా విషయానికి వస్తే వాళ్లేం బడ్జెట్ పెట్టలేదుగా'' అని అన్నారు.