నయనతార, ధనుష్ మధ్య 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో ధనుష్ నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ నయనతార, విఘ్నేష్ శివన్ ల నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌పై దావా వేసింది. నెట్‌ఫ్లిక్స్ డాక్యు-డ్రామా 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్‌'లో 'నానుమ్ రౌడీ ధాన్' ఫుటేజీని అనుమతి లేకుండా  ఉపయోగించారని, దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వివాదంలో ధనుష్ చేసిన కాపీరైట్ క్లెయిమ్ ను కొట్టివేయాలని నెట్ ఫ్లిక్స్ చేసిన రిక్వెస్ట్ ని మద్రాస్ హైకోర్టు మంగళవారం రిజెక్ట్ చేసింది. 

అసలేం జరిగిందంటే? 

నయనతార డాక్యుమెంటరీ వివాదంపై కోలీవుడ్ స్టార్స్ ధనుష్ - నయనతారలు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టు నయన్ కు షాక్ ఇచ్చే విధంగా, నెట్ ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పై ధనుష్ వేసిన దావాను సవాల్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. 

నెట్ ఫ్లిక్స్ వాదన ఏంటంటే? 

'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీని నవంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీలో నయనతార హీరోయిన్ గా, ధనుష్ నిర్మించిన 'నానుమ్ రౌడీ ధాన్' అనే సినిమాలోని బీటీఎస్ సీన్స్ ను తన అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ, 10 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ ధనుష్ దావా వేశారు. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ తమ ఆఫీస్ ముంబైలో ఉంది కాబట్టి, ఈ కేసును విచారించే అధికారం మద్రాస్ హైకోర్టుకు లేదని వాదించింది. పైగా 2020లోనే సెట్ నుంచి ఒక ఫోటోను రిలీజ్ చేసినప్పటికీ, డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యే వరకు నిర్మాతలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.

Also Read: మహా కుంభమేళాలో ముస్లిం దర్శకుడు... మతపరమైన విమర్శలకూ జవాబు

ధనుష్ న్యాయవాది సమాధానం 

ధనుష్ తరఫున వాదిస్తున్న లాయర్ డాక్యుమెంటరీ లో వాడిన ఫుటేజ్ ధనుష్ కు చెందినదని, ఇప్పటికే కాపీరైట్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ పై నయనతార సంతకం చేసిందని వెల్లడించారు. అనుమతి లేకుండా ఆ క్లిప్స్ ను ఉపయోగించడం అనేది కాపీ రైట్ వయోలేషన్ అవుతుందని వాదించారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా హెచ్చరించినట్టు ధనుష్ తరఫు న్యాయవాది వాదించారు. మొత్తానికి మద్రాస్ హైకోర్టులో నెట్ ఫ్లిక్స్ పై దావా వేయడానికి ఇప్పటికే ధనుష్ టీమ్ అనుమతి పొందారని వెల్లడిస్తూ,ధనుష్ ప్రొడక్షన్ హౌజ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది కోర్టు. అంతేకాకుండా ఈ కేసు కంటిన్యూ అవుతుందని చెబుతూ, ఫిబ్రవరి 5 కి విచారణను వాయిదా వేశారు. అయితే ఇంతకుముందే భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ లాస్ గాటోస్ ప్రొడక్షన్ సర్వీసెస్ ఇండియాపై దావా వేయడానికి వండర్‌బార్ ఫిల్మ్స్ హైకోర్టు అనుమతిని తీసుకున్నట్టు సమాచారం. మరి ఈ కేసు నెక్స్ట్ ఎలాంటి మలుపు తిరగబోతుందో ?

Also Readవైజాగ్‌లో 'తండేల్' ఆడకపోతే ఇంట్లో పరువు పోద్ది... ఇంట్లో రూలింగ్ వైజాగే (శోభిత) - నాగ చైతన్య