Devara Glimpse In Theaters: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్స్ అయిపోయారు ఎన్‌టీఆర్, రామ్ చరణ్. అందుకే తమ తరువాతి సినిమాల ప్లానింగ్ పక్కాగా జరుగుతోంది. ఔట్‌పుట్ బాగుండాలని షూటింగ్‌కు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్.. తన తండ్రితో కలిసి చేసిన ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఎన్‌టీఆర్ మాత్రం ఒక్కసారి కూడా వెండితెరపై కనిపించలేదు. అందుకే ఫ్యాన్స్ కోరికను తీర్చడం కోసం ఎన్‌టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ టీజర్‌ను వెండితెరపై చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


‘దేవర’ గ్లింప్స్..
కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీ నుండి ఇప్పటివరకు పోస్టర్స్ తప్పా ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ నుండి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. గ్లింప్స్‌ను రిలీజ్ చేయకపోయినా.. గ్లింప్స్ రిలీజ్ డేట్ అప్డేట్‌ను మాత్రం ఇచ్చారు మేకర్స్. జనవరి 8న ‘దేవర’ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రానుందని ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ గ్లింప్స్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఈ గ్లింప్స్‌ను వెండితెరపై చూసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక సినిమాతో ‘దేవర’ గ్లింప్స్‌ను యాడ్ చేయనున్నట్టు సమాచారం.






‘హనుమాన్’ కోసం వెళ్తే డబుల్ ట్రీట్..
జనవరి 12న ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ సినిమాలు థియేటర్లలో పోటీకి సిద్ధమవుతున్నాయి. అయితే అందులో ఒకటైన ‘హనుమాన్’ మూవీకి ‘దేవర’ గ్లింప్స్‌ను అటాచ్ చేయనున్నారట. ‘హనుమాన్’ మూవీ చూడడం కోసం థియేటర్లకు వచ్చినవారికి ‘దేవర’ గ్లింప్స్ డబుల్ ట్రీట్ ఇవ్వనుంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో హిందీతో ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తమ సినిమాలో కంటెంట్ ఉందని, అందుకే భయపడాల్సిన అసవరం లేదని ‘గుంటూరు కారం’తో సైతం పోటీకి దిగడానికి సిద్ధమయ్యారు ‘హనుమాన్’ మేకర్స్.


ఆశలన్నీ ‘దేవర’పైనే..
ఇక ‘దేవర’ విషయానికొస్తే.. ఇప్పటికే ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కమర్షియల్‌గా మంచి హిట్‌ను సాధించింది. మెసేజ్ ఓరియెంటెడ్ కథలకు కమర్షియల్ టచ్‌ను యాడ్ చేసి సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో కొరటాల శివ ఎక్స్‌పర్ట్. అలాంటి సినిమాలే తనను టాప్ డైరెక్టర్ స్థానంలో నిలబెట్టాయి. కానీ చిరంజీవితో తెరకెక్కించిన ‘ఆచార్య’తో తన మొదటి ఫ్లాప్‌ను అందుకున్నారు కొరటాల. అందుకే ‘దేవర’తో ఎలాగైనా ఫార్మ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. ఈ మూవీలో ఎన్‌టీఆర్ సరసన హీరోయిన్‌గా శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ.. ఈ మూవీతో తెలుగులో డెబ్యూ ఇవ్వనుంది. విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.


Also Read: లవర్‌కు హ్యాండ్ ఇస్తున్న 85 శాతం అమ్మాయిలు - 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్