Dasari Film Awards : దివంగత దర్శకరత్నగా పేరు, ప్రఖ్యాతలు పొందిన దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో దాసరి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగు సినీ ఇండస్ర్టీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, హీరో అలీ, ముత్యాల సుబ్బయ్య, వివి వినాయక్, సి. కల్యాణ్ లాంటి సినీ ప్రముఖులు ఉన్నారు.


సినీ ఇండస్ట్రీలో విశిష్ట సేవలందించిన ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, డాక్టర్ బ్రహ్మానందం, 'బలగం' సినిమా నిర్మాత హర్షిత్ రెడ్డి, వంశీ రామరాజు, కళా జనార్థన్, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్, దివాకర్, పబ్లిసిటీ డిజైనర్ రాంబాబు, వీఎఫ్ఎక్స్ చందు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ, కవిరత్న చింతల శ్రీనివాస్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఈ ఏడాది దాసరి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.


దాసరి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభలో పాల్గొన్న నటుడు అలీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉత్తమ హీరోకు తన వంతుగా రూ.50 వేల పారితోషికం ఇస్తానని చెప్పారు. దాసరి పేరు మీద నిర్వహించే ప్రతీ కార్యక్రమంలోనూ తాను పాల్గొంటున్నానని చెప్పారు. ఏటా దాసరి పేరు మీద ఈ తరహా అవార్డు ఇవ్వడం సంతోషకరమని, అభినందనీయమని డైరెక్టర్ వివి వినాయక్ తెలిపారు. ప్రతిభావంతులకు అవార్డ్స్ ఇవ్వడం ఆనందకరమని సి. కళ్యాణ్ కొనియాడారు.


ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ వ్యవస్థాపకులు కొత్త వెంకటేశ్వరరావు, మడిపడిగె రాజు, ముఖ్య సలహాదారులు బండారు సుబ్బారావు, పబ్బతి వెంకట రవి కుమార్ సారథ్యంలో జరిగిన ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణలో పలు రంగాల్లో కృషి చేస్తోన్న ప్రతిభావంతులకు దాసరి పురస్కారాలు ప్రదానం చేశారు.



Read Also: బెల్లంకొండ ‘ఛత్రపతి’ హిందీ ట్రైలర్ రిలీజ్, మాస్ యాక్షన్ తో ఊచకోత!



అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, టీఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెంరెడ్డి, దాసరి అల్లుడు డాక్టర్ రఘునాథ్ బాబు, రచయిత రాజేంద్ర కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు.


150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు.. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించిన ఆయన.. ఆయన అద్భుతమైన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. 'తాతా మనవడు', 'స్వర్గం నరకం', 'మేఘసందేశం', 'మామగారు' ఆయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. దాసరి తీసిన 'బొబ్బిలి పులి', 'సర్దార్ పాపారాయుడు' చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశంలో ప్రధానపాత్ర వహించాయి. 'మామగారు', 'సూరిగాడు' , 'ఒసేయ్ రాములమ్మ'.. చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో దాసరి నటనకు అనేక విమర్శకుల నుంచి ప్రశంసలు , బహుమతులు అందుకున్నాడు. అంతేకాకుండా 1986లో తెలుగు సంస్కృతి , తెలుగు చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను కూడా పొందాడు.