యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసే రష్మి గౌతమ్, జంతువుల పట్ల ఎంతో ప్రేమతో ఉంటుంది. మూగ జీవాలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా వెంటనే తను స్పందిస్తుంది. వీధి కుక్కలు, ఇతరు జంతువుల పట్ల ఎవరు అమానుషంగా ప్రవర్తించినా  సోషల్ మీడియా వేదికగా వారిపై విరుచుకుపడుతుంది.  కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన తర్వాత యాంకర్ రష్మిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే, రష్మీ మాత్రం తాను చెప్పాలనుకున్నది చెబుతూనే ఉంది. తాజాగా రష్మీ చేసిన మరో ట్వీట్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి.


మీ పిల్లలకు కనికరం గురించి నేర్పించండి- రష్మీ


తాజాగా రష్మి సోషల్ మీడియా లో  ఓ వీడియో షేర్ చేసింది. అందులో.. ఓ వీధిలో పడుకుని ఉన్న కుక్కలను కొంత మంది పిల్లలు అకారణంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నిద్రపోతున్న కుక్కపై ఓ పిల్లాడు నీళ్లు చల్లి పరుగులు పెట్టాడు. మరో చిన్న పిల్లాడు కుక్కను చేతితో కొడుతూ వెల్లగొట్టే ప్రయత్నం చేశారు. పిల్లలపై కుక్కలు దాడి చేశాయని గొడవ చేస్తారు. పిల్లలు ఇలా చేస్తే దాడి చేయవా అంటూ ఆ వీడియోపై రాసి ఉంది. ఈ వీడియోను ట్వీట్ చేసిన రష్మి “కుక్కలకు కూడా నొప్పి ఉంటుంది. మీ పిల్లలకు చెప్పండి. కనికరం ఎలా చూపించాలో బాగా నేర్పించండి. చిన్న పిల్లలు పొరపాటున కుక్కల దగ్గరికి వెళ్లడం గమనిస్తే, వెంటనే వారికి అక్కడ నుంచి తీసుకెళ్లండి. అనవసరంగా వాటిని కొట్టకండి. రాళ్లు విసరకండి. వాటికి కూడా బాధ కలుగుతుంది” అని రాసుకొచ్చింది. దీంతో నెటిజనులు మరోసారి రష్మీని ట్రోల్ చేస్తున్నారు. ‘‘కుక్కల దాడిలో పిల్లలు చనిపోయినప్పుడు స్పందించవు. కానీ, కుక్కలను రాళ్లతో కొడుతుంటే స్పందించావు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


















రష్మీపై దారుణ ట్రోలింగ్


అంబర్ పేటలో చిన్నారిపై కుక్కల దాడి ఘటన సమయంలో యాంకర్ రష్మిపై నెటిజన్లను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. పెట్ లవర్ అయిన రష్మి ఆ సమయంలో కుక్కలకు మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆమె ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మిని కుక్కను కొట్టినట్టు కొట్టాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి రెడీ అంటూ రష్మి సవాల్ విసిరింది. ''తప్పకుండా కొట్టొచ్చు. నేను ఒంటరిగా వస్తాను. నీ అడ్రస్ చెప్పు... ప్లీజ్! అప్పుడు చూద్దాం. నువ్వు సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తావో? ఇది ఓపెన్ ఛాలెంజ్'' అని రష్మీ ట్వీట్ చేసింది. మరికొంత మంది ఏకంగా ఆమెను యాసిడ్ పోస్తాం, బ్లాక్ మ్యాజిక్ చేస్తాం అంటూ బెదిరించారు.  తనకు వచ్చిన బెదిరింపు మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను రష్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. “నా మీద చేతబడి చేయిస్తానని, యాసిడ్ దాడి చేస్తానని బెదిరిస్తున్నారు. ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? వద్దా?” అని నెటిజన్స్ ను కోరింది.   


ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రష్మి, ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ప్రస్తుతం 'ఎక్స్‌ స్ట్రా జబర్ధస్త్'తో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి యాంకర్ గా చేస్తోంది.  టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. 


Read Also: బెల్లంకొండ ‘ఛత్రపతి’ హిందీ ట్రైలర్ రిలీజ్, మాస్ యాక్షన్ తో ఊచకోత!