Brahmaji X Post: ఏపీలో వరదలు బీభత్సం సృష్టించినా చంద్రబాబు ప్రభుత్వం బాధితులకు అండగా నిలవడంలో విఫలం అయ్యిందంటూ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ X వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ పోస్టుపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. జగన్ కు కౌంటర్ ఇచ్చేలా పోస్టు పెట్టారు.  ఆయన పోస్టుపై  వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బ్రహ్మాజీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. జగన్ కు వ్యతిరేకంగా తాను ఎలాంటి పోస్టు పెట్టలేదని వెల్లడించారు. తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని వెల్లడించారు. “నా X అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారు. నాకు ఆ ట్వీట్ కు సంబంధం లేదు. కంప్లైట్ చేశాం” అని పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.






ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


ఏపీలో వరదలు బీభత్సం సృష్టించి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందలేదని జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో వరదలకు ఎందుకు అల్లకల్లోలం సృష్టించాయో, దాని వెనుకున్న కారణాలు ఏంటో వివరిస్తూ X వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై  ఆంధ్రా ప్రభుత్వ పెద్దలతో పాటు టీడీపీ అభిమానులు, నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఐదేండ్లలో వైసీపీ స్కారు చేసిన నిర్వాకం కారణంగా ఈ రోజు విజయవాడకు ఈ దుస్థితి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు మాని, ఆకలితో అలమటిస్తున్న వారికి సాయం చేయడం మంచిదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


జగన్ పోస్టుపై బ్రహ్మాజీ సెటైర్లు


వరదల గురించి జగన్ మోహన్ రెడ్డి పెట్టిన పోస్టుకు నటుడు బ్రహ్మాజీ స్పందించారు. పలు విషయాలకు సంబంధించి వ్యంగ్యంగా స్పందించే ఆయన జగన్ పోస్టుకూ అలాగే రిప్లై ఇచ్చారు. “మీరు చెప్పేది నిజం సార్. వాళ్లు ఎలాగూ చెయ్యలేరు. ఇక నుంచి మనం చేద్దాం. ఫస్ట్ మనం రూ. 1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైసీపీ క్యాడర్ ను మొత్తం రంగంలోకి దింపుదాం. మనకు జనాలు ముఖ్యం. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సర్. జై జగన్ అన్నా” అంటూ X వేదికగా పోస్టు పెట్టారు.



బ్రహ్మాజీపై వైసీపీ నేతల ఆగ్రహం


బ్రహ్మాజీ జగన్ కు వ్యతిరేకంగా పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపింది. వైసీపీ నాయకులు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒక విషయం గుర్తుపెట్టుకో బఫూన్‌ బ్రహ్మాజీ.. సినిమాల్లో కామెడీ చేయ్ చిల్లర డబ్బులు రాలుతాయి. సీరియస్ మ్యాటర్‌లో కామెడీ చేయకు మూతీ పళ్ళు రాలుతాయి” అంటూ వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి చింత బ్రహ్మాజీ పై వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో బ్రహ్మాజీ తన అకౌంట్ హ్యాక్ అయ్యిదని చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది.  


Read Also: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్