ఇతర ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకోవడం అనేది టాలీవుడ్ కు కొత్తేమీ కాదు. తొలి తరం కథానాయికలకు పక్కన పెడితే, ఆ తర్వాతి జనరేషన్ నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అందాల ఆరబోతకు అడ్డుచెప్పరనో, ఫ్రెష్ నెస్ కోసమో, సినిమాకు మరింత క్రేజ్ వస్తుందనో తెలియదు కానీ.. అప్పట్లో మన ఫిలిం మేకర్స్ అంతా బాంబే బ్యూటీల వైపే మొగ్గు చూపేవారు.

 

అయితే ఇటీవల కాలంలో తెలుగులో బాలీవుడ్ హీరోయిన్ల హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. మన దర్శక నిర్మాతలు కన్నడ, మలయాళ ముద్దుగుమ్మలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల సందడి మొదలైన తర్వాత.. అప్పుడప్పుడు కొందరు బాలీవుడ్ భామలు టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు తెర మీద కనిపించబోతున్న బాలీవుడ్ కథానాయికలెవరో ఇప్పుడు చూద్దాం!

 

జాన్వీ కపూర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినషన్ లో తెరకెక్కుతున్న NTR30 సినిమాలో జాన్వీ కపూర్ ను మెయిన్ హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు. ఇటీవలే అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురైన జాన్వీకి ఇది తెలుగు డెబ్యూ. హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తూ వస్తోంది. ఎట్టకేలకు తారక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది.

దీపికా పదుకునే


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకునే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది దీపికాకు టాలీవుడ్ డెబ్యూ. పాన్ వరల్డ్ వైడ్ గా పలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమా కావడంతో.. రెమ్యునరేషన్ ఎక్కువైనా ఈ ముద్దుగుమ్మను తీసుకొచ్చారు. ఇప్పటికే దీపికా పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. 

 

దిశా పఠానీ


'ప్రాజెక్ట్ కె' సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అప్పట్లో 'లోఫర్' చిత్రంలో హీరోయిన్ గా నటించిన దిశా.. ఇన్నాళ్లకు మళ్లీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సూపర్ హీరో చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది.

కియారా అద్వానీ


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరక్టర్ శంకర్ కలయికలో వస్తోన్న RC15 చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా కనిపించనున్న సంగతి తెలిసిందే. గతంలో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ వంటి రెండు తెలుగు సినిమాలలో నటించిన ఈ ధోనీ భామ.. ఆ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు చరణ్ తో జోడీ కట్టబోతోంది. 2024లో ఈ పాన్ ఇండియా పొలిటికల్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కృతి సనన్


ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమాలో కృతి సనన్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ మూవీలో జానకి పాత్రలో కృతి కనిపించనుంది. '1 నేనొక్కడినే' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అందాల భామ.. వెంటనే 'దోచేయ్' సినిమా చేసింది. ఈ రెండూ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసి, స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. జూన్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

మానుషి చిల్లర్


మెగా ప్రిన్స్ వ‌రుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ద్వారా గార్జియస్ బ్యూటీ మానుషి చిల్ల‌ర్ టాలీవుడ్ లో తొలి అడుగు వేయబోతోంది. మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ అయిన మానుషి.. 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాతో హీరోయిన్‌గా లాంచ్ అయింది. ప్ర‌స్తుతం రెండు హిందీ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదే క్రమంలో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. 

 

ఇలా దీపికా పదుకునే దగ్గర నుంచి మానుషి చిల్ల‌ర్ వరకూ పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటికే RRR చిత్రంతో ఆలియా భట్ భారీ విజయాన్ని అందుకొని, సీతగా తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మరి రాబోయే కథానాయికలలో ఎవరెవరు మన ఇండస్ట్రీలో పాగా వేస్తారో చూడాలి.