బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ఏడు అడుగులు నడించింది. సెప్టెంబరు 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సుమారు 200 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. 50 మందికిపైగా వీఐపీలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో వీరి కోసం ప్రత్యేకమైన విడిది ఏర్పాట్లు చేశారు.


ప్రియాంక చోప్రా గైర్హాజరు


పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి తప్పకుండా పెళ్లికి హాజరవుతుందని అంతా భావించారు. అయితే, ఆమె చివరి క్షణంలో హ్యాండిచ్చింది. పెళ్లికి రాలేనని ముందుగానే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హింట్ ఇచ్చింది. ‘‘మై డియర్ కజిన్.. నీకు నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది’’ అని పేర్కొంది. సెప్టెంబరు 23న జరిగిన సంగీత్‌కు కూడా ప్రియాంక హాజరు కాలేదు. పెళ్లిలో కూడా ఆమె కనిపించలేదు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన జైఉల్ఫ్ కాన్సెర్ట్‌లో పాల్గోవడం కోసమే ప్రియాంక చోప్రా.. పరిణీతి పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంక.. ఆ కాన్సర్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో చెల్లి పెళ్లి కంటే ఆ కన్సెర్ట్ అంత ముఖ్యమైనదా అని అంటున్నారు. 


ఢిల్లీ సీఎం, సానియా మిర్జా, హర్భజన్ సింగ్ హాజరు


ఈ పెళ్లికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కెజ్రీవాల్ కూడా హాజరయ్యారు. టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా, క్రికెటర్ హర్బజన్ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శివసేన నేత ఆదిత్య థాకరే తదితర ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా ప్రత్యేకమైన బోటులో ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఈ పెళ్లిలో పరిణీత.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర రూపొందించిన పెళ్లి దుస్తులు ధరించింది. ఈ నెల 30 చండీగడ్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.






పరిణీతి చోప్రా సుమారు 12 ఏళ్లుగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తోంది. 2011లో రణవీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘లేడీస్ vs రికీ బహ్ల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2012లో వచ్చిన ‘ఇష్క్‌జాదే’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్లతో ఆశ్చర్యపరిచింది. ‘సుద్ దేశీ రొమాన్స్’ మూవీలోనూ ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అయితే, పరిణీతి తన కెరీర్‌లో ఒక్క దక్షిణాది సినిమా కూడా చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం పరిణీతి చోప్రా, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘మిషన్ రాణిగంజ్’ విడుదలకు సిద్ధమవుతోంది. 1989 రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్ డిజాస్టర్ సమయంలో 65 మంది మైనర్లను రక్షించిన ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అటు  ఇంతియాజ్ అలీ  జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘చమ్కిలా’లో కూడా  ఆమె కనిపించనుంది.  ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.


Also Read:  సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!