మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''భోళా శంకర్''. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు సోదరి పాత్రలో మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మరికొన్ని పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

 

ఈ రోజు మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రమ జీవులకు 'భోళా శంకర్' టీమ్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ క్రమంలో చిరంజీవికి సంబంధించిన మూడు స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వరల్డ్ లేబర్ డేకి తగ్గట్టుగా ఇందులో మెగాస్టార్ ఒక టాక్సీ డ్రైవర్ గా కనిపించాడు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ ని సూచిస్తూ బ్లూ యూనిఫాంలో ఉన్న చిరు స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

 

ఈ సందర్భంగా మేకర్స్ మరోసారి 'భోళా శంకర్' రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చారు. 2023 ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన తేదీకి రాకపోవచ్చని గత రెండు రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న తరుణంలో, చెప్పిన సమయానికి రావడం పక్కా అంటూ వాటికి చెక్ పెట్టారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు చిత్ర బృందం తెలిపింది.

 



తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘వేదాళమ్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్‌ గా భోళా 'శంకర్' రూపొందుతోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ కథలో.. దర్శకుడు మెహర్ రమేష్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఒక పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో చిరంజీవిని స్టైలిష్‌ అండ్ మాస్‌ క్యారెక్టర్‌ లో ప్రజెంట్‌ చేస్తున్నట్లు లేటెస్ట్ పోస్టర్స్ ను బట్టి అర్థమవుతోంది.

 

కాగా, 'భోళాశంకర్' చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నాడు. డూడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

 

ఈ చిత్రంలో రఘు బాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నుంచి రాబోతున్న మూవీ కావడంతో, ''భోళా శంకర్'' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.