పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రానికి రాజకీయ సెగ గట్టిగానే తగిలింది. అందులో ఉన్న ఒకే ఒక్క సీన్.. వైసీపీ నేతలను హర్ట్ చేసింది. శ్యాంబాబు పాత్రపై అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఆ వేడి ఇంకా చల్లారక ముందే చిరంజీవి చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. దీంతో వైసీపీ నేతలు, మంత్రులు ప్రెస్ మీట్‌లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు. ‘భోళాశంకర్’ మూవీ టికెట్ ధరలు పెంపుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సినిమాలో ఏపీ ప్రభుత్వంపై ఉన్న కొన్ని డైలాగులను తొలగించి వివాదాలకు తావులేకుండా చూడలని మేకర్స్ ప్రయత్నించినట్లు సమాచారం.


చిరు, పవన్ సినిమాలపై రాజకీయ నాయకుల ఫోకస్..


చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఇద్దరూ రాజకీయాల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించినప్పటి నుంచి వారు తెరకెక్కించే సినిమాలు కూడా కొంచెం అదే జోనర్‌లో సాగుతున్నాయి. వారు నటిస్తున్న సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండిపోయినా కూడా పలు డైలాగులు మాత్రం వారి రాజకీయ జీవితానికి సంబంధించినట్టు, పలువురికి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం ‘బ్రో’లో అంబటి రాంబాబు రిఫరెన్స్‌తో శ్యాంబాబు క్యారెక్టర్ ఉందని ఆగ్రహంతో వైసీపీ నేతలు ఎంత రచ్చ చేశారో తెలిసిందే. సినిమా కలెక్షన్ దగ్గర నుంచి పవన్ రెమ్యునరేషన్ వరకు అన్ని లెక్కలు బయటికి తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అందుకే చిరు నటించిన ‘భోళా శంకర్’కు ఇబ్బంది కలగకుండా కొన్ని డైలాగులు తొలగించాల్సిందే అని నిర్ణయించుకున్నారట మేకర్స్.


ఫైనల్ కాపీ నుంచి డైలాగులు కట్..
ఇప్పటికే ‘భోళా శంకర్’ సెన్సార్ రివ్యూ పూర్తయ్యింది. ఈ చిత్రానికి బోర్డ్ U/A సర్టిఫికెట్ కూడా అందజేసింది. అయినా కూడా ఈ మూవీలో ఉండే కొన్ని పొలిటికల్ పంచ్‌లను మూవీ టీమ్ తొలగించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా చిరుకు జోడీగా తమన్నా నటించింది. పైగా ఒక లాయర్ పాత్రలో ఈ మిల్కీ బ్యూటీ కనిపించనుంది. ఇక ఈ లాయర్‌కు అసిస్టెంట్‌గా కమెడియన్ హైపర్ ఆది కనిపించనున్నాడు. హైపర్ ఆది పాత్రకు ఫుల్‌గా డైలాగులు ఉన్నాయని, ఆ డైలాగులు అన్ని ఒక పార్టీని టార్గెట్ చేసేలా ఉంటాయని సమాచారం. అందులో కొన్ని డైలాగులు, పంచులు అలాగే ఉన్నా.. మరికొన్ని మాత్రం ఫైనల్ కాపీ నుంచి తొలగించినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ పంచులు పరోక్షంగా జనసేన పార్టీని ఆకాశానికి ఎత్తి, వైసీపీని విమర్శించినట్టుగా ఉంటాయట. 


కాంట్రవర్సీలు వద్దు..
‘భోళా శంకర్’ చిత్రాన్ని ప్రశాంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్న మెగాస్టార్.. కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాడట. అందుకే ఫైనల్ కాపీ నుంచి కొన్ని డైలాగులు తొలగించినా కూడా చిరు పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. ఇప్పటికే పలు రీమేక్‌లు చేసిన చిరంజీవి ‘భోళా శంకర్’ను కూడా తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గానే తెరకెక్కించాడు. కానీ చిరు చేస్తున్న రీమేక్‌లకు విసిపోయిన చాలామంది ప్రేక్షకులు, ఫ్యాన్స్.. ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ఈ మూవీకి పొలిటికల్ హీట్ తగిలితే అయినా ఫ్రీగా ప్రమోషన్ జరుగుతుంది అంటూ ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.


Also Read: అగ్గి తుఫాన్ వచ్చేస్తోంది, మీరు సిద్ధమేనా? ‘ఓజీ’ నుంచి అదిరిపోయే అప్‌డేట్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial