నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 'భగవంత్ కేసరి' సినిమాలో ఓ పాటను యాడ్ చేయబోతున్నామని చెబుతూ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.


బాలయ్య మార్క్ యాక్షన్ తో పాటు సమాజంలోని కొన్ని సున్నితమైన సమస్యలను సందేశాత్మకంగా చెబుతూ అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఈ సినిమాని తెరకెక్కించడం, బాలయ్యను సరికొత్త పాత్రలో చూపించడం ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో విజ్జీ పాపగా యంగ్ హీరోయిన్ శ్రీలీల అద్భుతమైన నటన కనబరిచింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని అందుకుంది. రెండో రోజు నుంచి ఈ చిత్రానికి కలెక్షన్స్ మరింత పెరగడంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంది.






ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా బాలయ్య ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ అందించారు. సోమవారం జరిగిన 'భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో మాట్లాడిన బాలయ్య త్వరలోనే 'భగవంత్ కేసరి'లో మరో పాట జత చేస్తున్నట్లు తెలిపారు. సుమారు నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ఓ పాటను 50 నుంచి 60 మంది డాన్సర్లతో తీశామని, త్వరలోనే ఆ పాటను యాడ్ చేయబోతున్నామని బాలయ్య అన్నారు. అయితే ఎప్పటినుంచి ఆ పాటని యాడ్ చేస్తున్నారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద అతి త్వరలోనే 'భగవంత్ కేసరి'లో కొత్త పాటను యాడ్ చేస్తున్నారనే విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


కాగా ఈ సినిమాలో 'దంచవే మేనత్త కూతురా' బిట్ సాంగ్ కూడా ఉంది. అయితే సందేశాత్మకంగా సాగే సినిమాలో రెగ్యులర్ మాస్ సాంగ్స్ ఉంటే మూవీ ఫ్లో డిస్టర్బ్ అవుతుందని చిత్ర యూనిట్ ఆ పాటను పక్కన పెట్టేశారు. రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఫ్యాన్స్ కోసం మళ్లీ యాడ్ చేస్తామని రీసెంట్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. ఇప్పుడు మరోసారి బాలయ్య కూడా అదే విషయం మీద క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న తరహా పాత్రలు పోషించి అలరించారు.


సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటుడు శరత్ కుమార్, రవిశంకర్, సుబ్బరాజు, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవి తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.


Also Read : తగ్గేదెలే అంటున్న తేజా సజ్జా - 'హనుమాన్' రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్, ట్రైలర్ ఎప్పుడంటే?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial