Amma Nanna o Tamila Ammayi Sequel: తెలుగు సినిమా పరిశ్రమలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ లో ఒకటి ‘అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి’.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. 2003లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ సినిమా  రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలోని పాటలు, డైలాగులు, ఫైట్స్ అన్నీ సూపర్‌ హిట్ అయ్యాయి. మ‌ద‌ర్‌ సెంటిమెంట్‌కు బాక్సింగ్ బ్యాక్‌ డ్రాప్‌ను జోడించి ,ద‌ర్శ‌కుడు పూరి ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. ఈ యాక్షన్ రోమాంటిక్ చిత్రంలో అసిన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, జయసుధ, అలీ, సుబ్బరాజు, ఐశ్వర్య, ధర్మవరపు సుబ్రమణ్యం, జునియర్ రేలంగి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాలు సమకూర్చారు.

   


‘ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి’ పేరుతో తమిళంలో రీమేక్


తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత తమిళంలో రీమేక్ అయ్యింది. ‘ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి’ పేరుతో ఈ సినిమా తమిళంలో రూపొందింది. మోహ‌న్‌ రాజా ఈ తమిళ రీమేక్ కు దర్శకత్వం వహించారు. అక్కడ ఈ సినిమాలో హీరోగా జయం రవి నటించారు.  త‌మిళ వెర్ష‌న్‌లోనూ  హీరోయిన్ గా అసిన్ న‌టించింది. తెలుగులో జయసుధ పోషించిన పాత్రలో తమిళంలో న‌దియా నటించింది.  సుమారు 15 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో నదియా తమిళ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ రీమేక్ ఆమెకు మంచి కమ్ బ్యాక్ గా నిలిచింది. ఆ తర్వాత తనకు వరుస అవకాశాలు వచ్చాయి.


‘ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి2’ పేరుతో సీక్వెల్


తాజాగా ‘ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి’ సినిమా సీక్వెల్ కు సంబంధించి దర్శకుడు మోహన్ రాజా కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా సీక్వెల్ గురించి స్పందించారు. ‘ఎం కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి 2’ పేరుతో ఈ సినిమా సీక్వెల్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సీక్వెల్ కు సంబంధించిన కథ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. ఈ సీక్వెల్‌ లో కూడా జ‌యం ర‌వి హీరోగా చేయబోతున్నట్లు చెప్పారు. అయితే, నదియా పాత్ర మాత్రం సీక్వెల్ లో ఉండబోదని మోహన్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక మోహ‌న్‌ రాజా రీసెంట్ గా  చిరంజీవితో కలిసి ‘గాడ్‌ ఫాద‌ర్’ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున‌, అఖిల్ తో కలిపి మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేశారు. అయితే, స్క్రిప్ట్ అనుకున్నట్లుగా రాకపోవడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయినట్లు టాక్ వచ్చింది. ఈ మల్టీ స్టారర్ మూవీని కాస్త పక్కన పెట్టి, ‘అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి’ తమిళ మూవీ సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


Read Also: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply