బాలీవుడ్ నుంచి త్వరలోనే మరో రామాయణం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అగ్ర దర్శకుడు నితీష్ తివారి భారీ బడ్జెట్‌తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటుల విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణంలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడిగా కేజిఎఫ్ హీరో యశ్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం నితీష్ తివారి రామాయణంలో అలియా భట్ భాగం కాదని తెలుస్తోంది. మొదట్లో తన భర్త రణబీర్ తో కలిసి రామాయణంలో సీత పాత్ర పోషించేందుకు ఓకే చెప్పిన ఆలియా భట్, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.


ఈ ప్రాజెక్టు కోసం ఆలియా భట్ దగ్గర సరిపడా డేట్స్ లేవట. అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం దర్శకులు నితీష్ తివారి ఆలీయాని ఎంతగా కన్విన్స్ చేయాలని చూస్తున్నా ఆమె అందుకు ఒప్పుకోవడం లేదట. ఆలియాతోపాటు కేజీఎఫ్ హీరో యశ్ కూడా ఈ ప్రాజెక్టులో రావణుడిగా నటించేందుకు అటు ఎస్ అని చెప్పక ఇటు నో అని చెప్పక మేకర్స్ ను కన్ఫ్యూజన్లో పడేసాడని, మరోవైపు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో డిసెంబర్లో మొదలు పెట్టాలనుకున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం యశ్ తో మేకర్స్ ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రీసెంట్ గానే యశ్‌కు సంబంధించి లుక్ టెస్ట్ కూడా చేశారట.


అయినా యశ్ ఈ ప్రాజెక్టు ఇంకా సైన్ చేయలేదు. అందుకు కారణం యష్ ఇప్పటికే నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మోహన్ దాస్ ఓ యాక్షన్ మూవీ చేయడం కోసం కమిట్ అయ్యాడు. అందుకే రామాయణాన్ని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. నితీష్ తివారితోపాటు నిర్మాత మధు వంతెన రామాయణాన్ని ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కించాలని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని వందల కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ రామాయణాన్ని ఎంతో గొప్పగా తీయాలని మేకర్స్ భావిస్తున్న సమయంలో ఇలాంటి అడ్డంకులు రావడం గమనార్హంగా మారింది. ఇప్పటికే రామాయణం ఆధారంగా వచ్చిన 'ఆదిపురుష్' దారుణమైన ఫలితాన్ని అందుకుంది.


అందుకు కారణం దర్శకుడు ఓం రౌత్ మేకింగ్ లో చేసిన తప్పులే. కానీ ఈసారి అలాంటి తప్పులు రిపీట్ కాకుండా మరింత జాగ్రత్తలు తీసుకొని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కాకుండా రియల్ విజువల్ ఎఫెక్ట్స్ తో రామాయణాన్ని తీయాలని నితీష్ తివారి ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ ప్రాజెక్టును ఆలియా భట్ రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఆమె స్థానంలో వేరొకరిని తీసుకోవడం మూవీ టీం కి పెద్ద సవాల్ గా మారింది. మృనాల్ ఠాగూర్, కియారా అద్వానీ లాంటి ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లను ఇప్పటికే మేకర్స్ ఆప్షన్స్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి చివరికి ఆ పాత్ర ఏ హీరోయిన్ కి దక్కుతుందో చూడాలి.


Also Read : 'గాండీవధారి అర్జున'లో ప్రపంచమంతా మారాలని క్లాస్ పీకడం లేదు, సమస్యను యాక్షన్‌తో చెప్పాం! - వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ







Join Us on Telegram: https://t.me/abpdesamofficial