క్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘OMG 2’ మూవీకి ఆది నుంచి అవాంతరాలే ఎదురవ్వుతున్నాయి. ‘ఆదిపురుష్’ మూవీ ఇచ్చిన షాక్ వల్ల.. సెన్సార్ బోర్డు ఈ సినిమా విషయంలో కఠినంగా వ్యవహరించింది. డైలాగ్ నుంచి సీన్స్ వరకు ప్రతి ఒక్క అంశాన్ని నిశితంగా పరిశీలించింది. ఏకంగా అక్షయ్ కుమార్ పోషించిన శివుడి పాత్రనే మార్చేయాలంటూ సలహా ఇచ్చింది. అంతేకాదు సుమారు 24 కట్స్‌తో సినిమా రిలీజ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ సినిమా పెద్దలకు మాత్రమేనంటూ ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో దేవుడి సినిమా అడల్ట్ సర్టిఫికెట్ ఏమిటంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమా విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో చేసేది ఏమీ లేక దర్శక నిర్మాతలు సెన్సార్ సూచించినవన్నీ పాటిస్తామని చెప్పడంతో.. రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాలో అక్షయ్‌ను మొదట్లో శివుడిగా చూపించారు. సెన్సార్ సూచనతో.. ఆయన్ని శివుడు పంపిన దూతగా చూపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో కూడా మార్పులు చేసి.. అక్షయ్‌ను శివుడి దూతగా చూపించారు. 


ఇండియాలో ‘A’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాను ఇస్లామిక్ దేశాల్లో ప్రదర్శనకు అనుమానిస్తారా లేదా అనే సందేహాలున్నాయి. ఎందుకంటే.. కొన్ని దేశాల్లో ఇండియాలో జారీ చేసిన సర్టిఫికెట్‌తో జారీ చేసిన సెన్సార్‌ను అనుమతించరు. అక్కడ కూడా ప్రత్యేకంగా సెన్సార్ బోర్డులు ఉంటాయి. ముఖ్యంగా UAE వంటి దేశాల్లో ఏ సినిమా అయినా సరే స్క్రీనింగ్‌కు ముందు సెన్సార్ అనుమతి పొందాల్సిందే. ఈ నేపథ్యంలో ‘OMG 2’ మూవీ మేకర్స్ UAE సెన్సార్ బోర్డు కూడా ఈ మూవీని పంపించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన బోర్డు సభ్యులు 12A సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దీని ప్రకారం ఆ దేశంలో12 ఏళ్లు పైబడిన ఎవరైనా సరే ఈ మూవీని చూడవచ్చు. పైగా ఈ మూవీలో ఒక కట్‌ను మాత్రమే సూచించారు. షర్ట్ లేకుండా కనిపించిన సీన్ మాత్రమే తొలగించాలని పేర్కొన్నారు. 


యూఏఈలోని 12A, ఇండియాలోని A సర్టిఫికెట్‌కు తేడా ఏమిటీ?


యూఏఈలో జారీ చేసిన 12A సర్టిఫికెట్‌ ప్రకారం పన్నెండుళ్లు పైబడిన పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా చూడవచ్చు. ఇండియాలో జారీ చేసిన A సర్టిఫికెట్ మూవీస్‌ను కేవలం 18 ప్లస్ వయస్సు వ్యక్తులు మాత్రమే చూడాలి. 18 ఏళ్ల లోపు పిల్లలు, యువతకు అనుమతి ఉండదు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ దేశాలు చెప్పని అభ్యంతరాలు ఇండియాలో ఎందుకు వ్యక్తం అవుతున్నాయనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. పైగా భారతీయులు విశ్వసించే దేవుడి సినిమాకు ‘అడల్ట్స్ ఓన్లీ’ సర్టిఫికెట్ జారీ చేయడం ఏమిటని అంటున్నారు. సినిమాల విషయంలో ఎంతో కఠినంగా ఉండే UAE ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మన సెన్సార్ సభ్యులపై పలువురు విమర్శలు చేస్తున్నారు.


‘ఆదిపురుష్’ సినిమా వల్లే.. సెన్సార్ నియమాలు కఠినం


ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ మూవీ సినిమాపై వచ్చిన విమర్శల వల్లే సెన్సార్ బోర్డు ఈ సారి కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. ‘ఆదిపురుష్’ సినిమాల్లో డైలాగులను విని ఆశ్చర్యపోయిన అలహాబాద్ కోర్టు.. అసలు సెన్సార్ బోర్డు ఎలా ఇలాంటి డైలాగులకు అనుమతి ఇచ్చిందని వ్యాఖ్యనించింది. ఇలాంటి సినిమాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అలాగే ఫిల్మ్ మేకర్స్‌కు సైతం అక్షింతలు వేసింది. ఆ ప్రభావమే వల్లే ‘ఓఎంజీ 2’ సెన్సార్ కత్తెరలో విలవిల్లాడింది. పైగా ఈ మూవీ స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ కోసం ప్రస్తావన ఉన్నట్లు సమాచారం. అందుకే, సెన్సార్‌ బోర్డుకు కూడా ఈ మూవీ పెద్ద సవాలుగా మారింది. చివరికి.. కొన్ని సీన్లు, డైలాగులను తొలగించాలని సూచిస్తూ ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్‌తో పాటు పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ మరికొన్ని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 


 Also Read : ‘ఖుషి’ రికార్డ్‌ను బ్రేక్ చేసిన మహేష్ - రీ రిలీజ్‌లో 'బిజినెస్ మెన్' ఆల్ టైమ్ రికార్డ్!