బాలీవుడ్‌లో కొన్ని పాథ్ బ్రేకింగ్ సినిమాలు తెరకెక్కాయి. ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు వెళుతుంటే.. కొందరు మేకర్స్ మాత్రం ప్రేక్షకులకు ఏదో భిన్నంగా చూపించాలి అనే ఉద్దేశం కొత్త కొత్త కథలను రాసేవారు. అలాంటి కథల్లో ‘ఓఎమ్‌జీ’ కూడా ఒకటి. అసలు ‘ఓఎమ్‌జీ’ అనేది కాంట్రవర్సీతో కూడుతున్న సబ్జెక్ట్. అందుకే సినిమా విడుదలైన తర్వాత దీని చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి. అయినా కూడా మేకర్స్ ఆలోచనను చాలామంది ప్రశంసించారు. దేవుడు ఉన్నాడా లేదా అనే సబ్జెక్ట్‌ను చాలా అర్థవంతంగా తెరకెక్కించారని ప్రశంసలు వచ్చాయి. అయితే, ‘OMG 2’పై మాత్రం ఉత్కంఠ నెలకొంది. సెన్సార్ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో రిలీజ్ తర్వాత ఎలాంటి వివాదాలు వస్తాయో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు, ప్రముఖ ఆద్యాత్మిక గురువు సద్గురు కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.


‘ఓఎమ్‌జీ 2’పై సద్గురు రివ్యూ..
అక్షయ్ కుమార్‌తో కలిసి ‘ఓఎమ్‌జీ2’ చూసిన సద్గురు రివ్యూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఓఎంజీ2 టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కొయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లోనే ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు ఏర్పాటు చేశారు. అనంతరం సద్గురు ట్విట్టర్ ద్వారా మూవీ రివ్యూ ఇచ్చారు. ‘‘నమస్కారం, అక్షయ్ కుమార్. మీరు ఇషా యోగా సెంటర్‌కు రావడం, నేను ‘ఓ మై గాడ్ 2’ను చూడడం చాలా అద్భుతంగా ఉంది. సమాజంలో మహిళల రక్షణ కోసం, వారి గౌరవాన్ని నిలబెట్టడం కోసం ప్రజలు ఎలా వారి శారీరక అవసరాలను కంట్రోల్ చేసుకోవాలనే విషయాలు తెలియజేయడం చాలా ముఖ్యం. కేవలం సమాచారాన్ని మాత్రమే కాకుండా యూత్ ఎలా తమ శరీరాన్ని, ఆలోచనలను, ఎమోషన్స్‌ను హ్యాండిల్ చేయాలి అనే విషయాలపై  మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికైనా దృష్టిపెడితే బాగుంటుంది’’ అని ట్వీట్ చేశారు సద్గురు.


అక్షయ్ కుమార్ స్పందన..
సద్గురు చేసిన ఈ ట్వీట్‌కు అక్షయ్ కుమార్ స్పందించారు. ‘‘నమస్కారం సద్గురు. ఇషా యోగా సెంటర్‌ను సందర్శించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఒక అద్భుతమైన అనుభూతిని పొందాను. ‘ఓఎమ్‌జీ 2’ చూసినందుకు, ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మీరు నా కష్టాన్ని, నా టీమ్ కష్టాన్ని చూడడం, ఆశీర్వదించడం అనేది మాకు చాలా పెద్ద విషయం’’ అంటూ సంతోషంగా సద్గురు ట్వీట్‌కు రెస్పాండ్ అయ్యాడు అక్షయ్ కుమార్. 


‘ఓఎమ్‌జీ 2’ క్యాస్ట్ అండ్ క్రూ..
‘ఓఎమ్‌జీ’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఓఎమ్‌జీ 2’ను దర్శకుడు అమిత్ రాయమ్ తెరకెక్కించారు. ‘ఓఎమ్‌జీ’లో కృష్టుడి పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్.. ఇందులో శివుడి పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ పాజిటివ్ రివ్యూలను అందుకుంది. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి, అరుణ్ గోవిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఓఎమ్‌జీ 2’ ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. 2012లో ‘ఓఎమ్‌జీ’ విడుదల కాగా.. 11 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వచ్చేస్తుంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అశ్విన్ వర్దే, విపుల్ డీ షా, రాజేష్ బాహ్ల్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.


Also Read: రణవీర్ vs షారుఖ్ - ‘డాన్ 3’పై ఫ్యాన్స్ ఫైర్, ఆ హీరో వద్దుంటూ రచ్చ!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial