గతేడాది ‘బంగార్రాజు’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. 'థాంక్యూ' చిత్రంతో డిజాస్టర్ చవిచూశాడు. అలానే తొలిసారి హిందీలో నటించిన 'లాల్ సింగ్ చెద్దా' సినిమా కూడా నిరాశ పరిచింది. ఎలాగైనా హిట్టు కొట్టాలని 'కస్టడీ' సినిమాతో వచ్చిన చైతూని, ఈసారి కూడా పరాజయమే పలకరించింది. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ బైలింగ్వల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో అక్కినేని వారసుడి నెక్స్ట్ మూవీ ఏంటి? ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు? అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చై నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. 


నాగచైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ని తాజాగా నిర్మాత బన్నీ వాసు కంఫర్మ్ చేసారు. '2018' మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఈ ఏడాది కచ్చితంగా GA2 పిక్చర్స్ బ్యానర్ లో చైతూతో సినిమా ఉంటుందని అన్నారు. డైరెక్టర్ ఎవరనేది చెప్పలేదు కానీ, అతి త్వరలో అన్ని విషయాలతో అనౌన్స్ మెంట్ చేస్తామని తెలిపారు. దీంతో అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ లో చై నటించిన '100% లవ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అఖిల్ అక్కినేనికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూపంలో తొలి సక్సెస్ వచ్చింది కూడా ఈ బ్యానర్ లోనే. అందుకే చైతన్యకు మరో హిట్ గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 


అందులోనూ ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చందూ.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నాగచైతన్యతో మూవీ చేయనున్నట్లు బన్నీ వాసు చెప్పడంతో, ఇది తప్పకుండా చందూ మొండేటి దర్శకత్వంలోనే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. 


Read Also: 'లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం' - ఎన్టీఆర్ సినిమాల్లో మహిళాభ్యుదయం


స్వతహాగా అక్కినేని నాగార్జునకు వీరాభిమాని అయిన చందు మొండేటికి నాగచైతన్యతో మంచి సాన్నిహిత్యం ఉంది. వీరి కాంబినేషన్ లో రూపొందిన 'ప్రేమమ్' మూవీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన 'సవ్యసాచి' సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, చైతూని బాగా ప్రెజెంట్ చేసాడు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. 


నిజానికి 'కార్తికేయ 2' సక్సెస్ తర్వాత చందు మొండేటి బాలీవుడ్ హీరోలతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. అయితే అక్కడ హీరో డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో, ఈలోగా మరో సినిమా చేయాలని కథ రెడీ చేసుకున్నారట. ఇది గీతా కాంపౌండ్ లో అందరికీ నచ్చడంతో, ఈ స్టోరీని నాగచైతన్య వద్దకు తీసుకెళ్లారట. చందూ చెప్పిన స్టోరీ లైన్ కి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని వినికిడి. మరి త్వరలోనే గీతా ఆర్ట్స్ లో చైతన్య - చందూ కాంబోపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. 


ఇదిలా ఉంటే 'నాంది' 'ఉగ్రమ్' చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల... నాగచైతన్యతో సినిమా చేయాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ కథకి చైతూ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే క్లైమాక్స్ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో, ముందుకు వెళ్లలేదని ఇటీవల డైరెక్టర్ తెలిపారు. అయితే డెఫినెట్ గా చైతన్యతో ఉంటుందని నమ్మకంగా చెప్పాడు. ఏదేమైనా చైతూ తన నెక్స్ట్ సినిమాలతో మంచి విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 


Read Also: బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా